ఆమె పేరు పూజా వసంత్ రాథోడ్. పూణేలోని వడ్గావ్ శేరిలో నివాసం ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతోంది. ఉన్నత చదువులు చదివిన ఈ యువతి జీవితంలో గొప్పగా స్థిరపడాలనే కలలు కనేది. దాని కోసం ఆ యువతి అహర్నిశలు కృషి చేస్తూనే వచ్చింది. కట్ చేస్తే ఈ యువతి ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో తల్లిదండ్రుల కంట కన్నీరు ఏరులై పారుతోంది. ఈ విషాద ఘటన వెనుక అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది మహారాష్ట్ర పూణేలోని వడ్గావ్ శేరి ప్రాంతం. ఇక్కడే షోలాపూర్ జిల్లా కొండి తండాకు చెందిన పూజా వసంత్ రాథోడ్ అనే 25 ఏళ్ల యువతి సోదరితో పాటు నివాసం ఉంటుంది. ఉన్నత చదువులు చదివిన పూజా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్దమవుతోంది. కాగా పూజా ఎప్పటిలాగే మంగళవారం నాడు ఓ స్టడీ సెంటర్ తనంతట తాను చదువుకుంటూ ఉంది. అలా కుర్చిలో కూర్చుని చదువుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సీన్ ను చూసిన తోటీ స్నేహితులు షాక్ కు గురై ఆమెను లేపే ప్రయత్నం చేశారు. కానీ పూజా అస్సలు స్పందించలేదు. వెంటనే తోటి స్నేహితులు కలిసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు పూజా గుండెపోటుతో మరణించిందని చెప్పినట్లు సమాచారం. ఇక కూతురు మరణవార్త తెలుసుకున్న పూజా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే జీవితంలో ఏదో సాధిస్తానని చెప్పి వెళ్లిన కూతురు ఇలా విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో పూజా స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.