దారుణం చోటు చేసుకుంది. బస్సు సిబ్బంది ఒక ప్రయాణికుడిని కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ ప్రయాణికుడు మృతి చెందాడు.
కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ లో పని చేసే సిబ్బంది ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పరుష పదజాలంతో దూషించడం, దురుసుగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. వయసులో ఉన్న అమ్మాయిలు ఎక్కితే చుంగ కార్చుకునే ప్రైవేటు డ్రైవర్లు, క్లీనర్లు ఉంటారు. అదే అబ్బాయిలు గానీ, పెళ్ళైన మహిళలు, మగవాళ్ళు ఎక్కితే మాత్రం మర్యాద లేకుండా మాట్లాడతారు. ప్రైవేటు బస్సు డ్రైవర్, క్లీనర్లపై పలు ఫిర్యాదులు కూడా చేస్తుంటారు. లగేజ్ పెట్టుకునే సమయం కూడా ఇవ్వరు. ఇలా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఏదో సాధించాం అన్న ఫీలింగ్ లో ఉంటారు కొంతమంది. తాజాగా ఒక ప్రయాణికుడి విషయంలో బస్సు సిబ్బంది ఇలానే దురుసుగా ప్రవర్తించారు. కదులుతున్న బస్సులోంచి ప్రయాణికుడిని బయటకు తోసేశారు.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి కూడలి సమీపంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్ కుమార్ (27) అనే యువకుడు అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి తన స్నేహితులతో కారులో శ్రీకాకుళం వెళ్ళాడు. ఆ తర్వాత పనుందని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో భరత్ కుమార్ ను స్నేహితులు తెల్లవారుజామున భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎక్కించారు. నవభారత్ కూడలి వద్ద బస్సు ఎక్కిన భరత్ కుమార్ ను బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ రామకృష్ణ రూ. 200 ఛార్జీ డబ్బులు అడిగారు. తన దగ్గర డబ్బు లేకపోవడంతో స్నేహితులు ఫోన్ పే చేస్తారని చెప్పాడు భరత్. అయితే ఎంతసేపటికీ స్నేహితులు ఫోన్ పే చేయలేదని డ్రైవర్, క్లీనర్ మరోసారి డబ్బులు అడిగారు.
భరత్ స్నేహితులకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో విశాఖపట్నం వెళ్లిన తర్వాత ఇస్తానని భరత్ చెప్పాడు. కానీ డ్రైవర్, క్లీనర్ భరత్ మాట పట్టించుకోకుండా అతనితో గొడవ పడ్డారు. బుడుమూరు సమీపంలో భరత్ ను కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేశారు. దీంతో డివైడర్ మధ్యలో ఉన్న క్రాస్ బేరియర్ ను ఢీకొన్నాడు. దీంతో తలకు బలమైన గాయం కాగా, కాలు విరిగిపోయింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న భరత్ ను హైవే పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ దొరకడంతో మూడు రోజుల పాటు హైవేపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మడపాం టోల్ ప్లాజా తదితర చోట్ల తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రైవేటు బస్సు డ్రైవర్, క్లీనర్ ను పట్టుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని పోలీసులు తెలిపారు. ఛార్జీ డబ్బులు ఇవ్వలేకపోతే బస్సు ఆపి దించాలి గానీ ఇలా తోసేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లు, క్లీనర్ల వల్ల ప్రైవేటు బస్సులు ఎక్కాలంటేనే జనం భయపడిపోతున్నారు. మరి టికెట్ కి డబ్బులు గమ్యం చేరిన తర్వాత ఇస్తానన్న వినకుండా బస్సులోంచి తోసయడంపై మీ అభిప్రాయమేమిటి? మీ లైఫ్ లో కూడా బస్సు సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి.