పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు శశికళ. ఆమెకు ఏడాదిన్నర కిందట ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతనితో కొంత కాలం పాటు ఛాటింగ్ చేసింది. అలా ఛాటింగ్ చేసుకుంటున్న క్రమంలోనే ఒకరి మనసులు ఒకరు తెలుసుకున్నారు. అలా వీరి ఫేస్ బుక్ పరిచయం చివరికి ప్రేమ అనే మొగ్గ తొడిగింది. ఇక ఇంకేముంది.. ఇద్దరూ ఏంచక్కా ప్రేమ విహారంలో తేలియాడుతూ చివరికి ఆర్య సమాజ్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. రెండునెలల తర్వాత భర్త ఇచ్చిన మాట తప్పాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ప్రకాశం జిల్లాలోని కందుకూరు. ఇదే గ్రామానికి చెందిన శశికళ (19) అనే యువతికి లింగన్నపాలానికి చెందిన శివకుమార్ రెడ్డి అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరు కొన్ని రోజుల పాటు ఛాటింగ్ చేసుకున్నారు. అలా వీరి ఫేస్ బుక్ పరిచయం రాను రాను ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో ఇద్దరూ ఎంచక్కా ప్రేమ విహారంలో తేలియాడుతూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. రోజులు మారే కొద్ది వీరి ప్రేమ బలంగా తయారైంది. ఇక చివరికి పెళ్లి చేసుకోవాలని పెద్దలకు చెప్పారు. వీరి పెళ్లికి పెద్దలు మాత్రం అంగీకరించలేదు. ఇక చేసేదేం లేక శశికళ, శివ కుమార్ రెడ్డి ఆగస్టు 16న హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు.
ఇక కొంత కాలం తర్వాత ఆ ఇద్దరు దంపతులు లింగన్నపాలెం చేరుకున్నారు. ఇక్కడే కొన్ని నెలల పాటు సంసారం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక విషయం ఏంటంటే? శివ కుమార్ రెడ్డికి మొదట్లో మద్యం తాగే అలవాటు ఉంది. అయితే పెళ్లి సమయంలో మద్యం తాగనని శివ కుమార్ రెడ్డి భార్య శశికళకు మాటిచ్చాడు. అలా కొన్నాళ్ల పాటు భార్యకు ఇచ్చిన మాటలో భాగంగా భర్త శివ కుమార్ రెడ్డి గీత దాటలేదు. కానీ శివ కుమార్ రెడ్డి కొన్నాళ్ల తర్వాత భార్యకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి మళ్లీ తాగుడు మొదలు పెట్టాడు. అయితే ఈ నెల 4న భర్త శివ కుమార్ రెడ్డి భార్య కళ్ల ముందటే మద్యం సేవిస్తూ దొరికిపోయాడు. నాకు ఇచ్చిన మాటను కాదని మళ్లీ తాగుతున్నావా అంటూ భర్తతో గొడవకు దిగింది.
ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వెంటనే భార్య శశికళ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భర్తకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన భర్త భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇక చికిత్స పొందుతూ శశికళ బుధవారం ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణించడంతో భర్త కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. ఇక కూతురు మరణవార్త తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు సైతం గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం శశికళ తల్లిదండ్రులు భర్త శివ కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.