టీమిండియా ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ ఆడినా.. అక్కడ ప్రత్యక్షమయ్యే ఒక వ్యక్తి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు సుపరిచితుడే. వళ్లంతా జాతీయ జెండా రంగులను పూసుకుని ఛాతీపై టెండూల్కర్ 10 అని రాసుకుని చేతిలో పెద్ద జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ భారత్ ఆటగాళ్లను ఉత్సహపరిచే సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి క్రికెట్ చూసే ప్రతిఒక్కరికి తెలిసే ఉంటుంది. కాగా సుధీర్ కుమార్పై గురువారం పోలీసులు దాడి చేశారు. బీహార్లోని ముజఫర్పూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఆఫీసర్ గురువారం తీవ్రంగా రాత్రి కొట్టినట్లు సమాచారం.
సుధీర్ కుమార్ చౌదరి సోదరుడు కిషన్ కుమార్ను భూమి విక్రయం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సుధీర్ కుమార్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో పోలీసులు తనపై దాడి చేసినట్లు సుధీర్ తెలిపారు. కాగా ఈ విషయంపై స్పందించిన సుధీర్.. “నా సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఈ విషయం గురించి ఆరా తీసేందుకు నేను అక్కడికి వెళ్లాను. లాకప్లో ఉన్న మా అన్నతో మాట్లాడుతుండగా, డ్యూటీ ఆఫీసర్ వచ్చి నాతో దుర్భాషలాడాడు. అతను నన్ను రెండుసార్లు తన్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లాలని ఆదేశించాడు. అతను నాతోపాటు, నా సోదరుడిని కూడా అసభ్య పదజాలంతో దూషించాడు” అని తెలిపారు.
సంఘటన జరిగిన తరువాత, సుధీర్ ఆ ఏరియా ఎస్డీపీఓ రామ్ నరేష్ పాశ్వాన్కు సమాచారం అందించారు. ఈ విషయంపై సరైన విచారణకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం ఇదే ముజఫర్పూర్ పోలీసులు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్ కుమార్ గుర్తుచేసుకున్నారు. “అప్పట్లో వాళ్లు నన్ను సెలబ్రిటీలా చూసుకున్నారు. నేను ప్రారంభించిన అదే పోలీస్ స్టేషన్లోని పోలీసులు నన్ను అవమానించడమే కాకుండా కొట్టడం చాలా బాధించింది. ఇది సామాన్యుడి పట్ల పోలీసుల వైఖరిని తెలియజేస్తోంది” అంటూ వాపోయాడు.