ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఆడ్డంకులు, అవరోదాలు ఎన్ని ఎదురైన కోరుకున్నవాడినే మనువాడాలనే కోరిక బలంగా రాటుదేలేంది. ఇక తల్లిదండ్రులు కాద్దన్నా సరే, ఎలాగైన తన ప్రియుడినే పెళ్లి చేసుకుని అతనితోనే కాపురం చేయాలని అనుకుంది. అనుకున్నట్లే ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాదన్న కూడా ఒప్పించి మరీ ప్రియుడితోనే మేడలో తాళి కట్టించుకుంది. కట్ చేస్తే ఆరు నెలల తిరిగే సరికి కట్టుకున్న వాడి వేధింపులు భరించలేక, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తాజాగా నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..అది నల్గొండ జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం. ఇదే ప్రాంతానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలంలోని తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వీరి ప్రేమ ఇరువురి ఇంట్లో చెప్పుకున్నారు. కూతురు ప్రేమ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు మొదట్లో ససేమెరా అన్నారు. అయితే పట్టుబట్టిన రమాదేవి ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తంతులో భాగంగా విజయ్ కు కట్నం కింద నగదుతో పాటు ప్లాటు, మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని ఒప్పుకున్నారు. సూర్యాపేటలో కొంత కాలం కాపురం పెట్టారు. పెళ్లైన కొన్ని రోజుల వరకు ఎలాంటి గొడవలు లేకుండా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయింది. అయితే రోజులు గడిచే కొద్ది భర్త విజయ్ భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో వేధింపులు భరించలేని రమాదేవి ఇటీవల ఇంట్లో ఏదో తెలియని టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమాదేవి శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక రమాదేవి తండ్రి భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.