బ్యాంక్ ఉద్యోగి అంటేనే.. వేలల్లో జీతం, సౌకర్యవంతమైన పనివేళలు. ఇంతకంటే సుఖవంతమైన జీవితం ఉంటుందా! ఉండదు. కానీ, ఓ బ్యాంకు మేనేజర్ కు వస్తున్న జీతం సరిపోలేదు. రైతుల డబ్బులు నొక్కేయాలన్నాదుర్బుద్ధి మదిని తట్టింది. ఎలానూ బ్రాంచ్ మేనేజర్ నేనేగా.. నన్నెవరు అడుగుతారులే అన్నట్లుగా.. రైతుల డబ్బులను నొక్కేయడం మొదలుపెట్టాడు. బ్యాంకుకు వచ్చే వారికి మాయమాటలు చెప్తూ.. ఖాతాల్లో జమ చేయాల్సిన డబ్బును జల్సాలకు వాడుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా, వంగూరు మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు( ఐఓబీ)లో భాస్కర్రెడ్డి అను ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు రైతులంటే మహా ఇష్టం. ఎవరొచ్చినా కూర్చోపెట్టి మంచిగా మాటలు చెప్పేవాడు. ఆయన ఇటీవల.. క్రాప్ లోన్లకు ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్) అవకాశం లేకున్నా.. ఉన్నట్లుగా ప్రకటించాడు. దీంతో ఎంత కొంత మొత్తంలో తగ్గుతుంది అని కదా అనుకున్న రైతులు, లోన్ చెల్లించడం మొదలుపెట్టారు. అలా ఓటీఎస్ కింద డిండిచింతపల్లికి చెందిన ఓ రైతు రూ.లక్ష5వేలు కట్టగా, అతని అకౌంట్లో రూ.80 వేలు జమచేసి మిగిలిన రూ.25వేలును సొంతానికి వాడుకున్నాడు. ఈ పరంపర అలానే కొనసాగుతూ వచ్చింది.
ఉల్పరకి చెందిన ఒక వ్యక్తి రూ.2లక్షల70వేలు కట్టగా.. రూ.2.10 లక్షలు జమ చేసి మిగిలిన రూ.60వేలు, అలాగే మరో రైతు రూ.లక్ష కట్టగా.. అకౌంట్లో రూ. 25వేలు జమ చేసి మిగిలిన రూ. 75వేలు, సర్వారెడ్డిపల్లికి చెందిన ఓ రైతు రూ.95 వేలు కట్టగా.. రూ.40వేలు జమచేసి మిగిలిన రూ. 55 వేలు.. ఇలా దాదాపు 16 మంది రైతుల డబ్బులు కట్టినట్లే కట్టి మిగిలిన సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. రైతులు రిసిప్ట్ ఇవ్వమని అడగగా రేపు ఎల్లుండి అంటూ సమాధానం దాటవేస్తూ వచ్చాడు. దీంతో మేనేజర్ పై ఓ రైతు హెడ్ ఆఫీసుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై.. గత సోమవారం చీఫ్ జనరల్ మేనేజర్ ఎంక్వైరీకి రాగా బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బ్యాంక్లోనే స్పృహ తప్పిపడిపోయాడు. ఈఘటనలో.. ఓ రైతు, తాను రూ.60వేలు మోసపోయానని తెలుసుకొని బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ కారు తీసుకుపోయాడు. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ జనరల్ మేనేజర్, విచారణ జరుపుతున్నామని, నాలుగైదు రోజుల్లో పరిష్కారం లభిస్తుందని తెలిపారు.