సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త తానూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాజాగా కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ భర్తగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా గరేడుపల్లి మండలం కల్మల చెర్వే గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన గుంటి శివ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి గత 20 ఏళ్ల కిందట మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. గతంలో శివ యామిని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కొంత కాలం తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఇక కొన్నా రోజుల తర్వాత భర్త శివ మిర్యాలగూడలో మీ సేవ కేంద్రాన్ని నడిపిస్తుండగా, భార్య ఆధార్ సెంటర్ ను నడిపిస్తుంది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు భగ్గుమన్నాయి. దీంతో తరుచు ఇద్దరూ గొడవపడేవారు. అయితే డిసెంబర్ 30న ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.
భర్తపై కోపంతో యామిని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త శివ ఇంటికి వచ్చి చూడగా భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన భర్త తట్టుకోలేక మిర్యాలగూడలోని ఐలాపురం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాజాగా అటుగా వెళ్తున్న కొందరు స్థానికులకు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే కాలువలో దూకి చనిపోయింది డిసెంబర్ 30న ఆత్మహత్య చేసుకున్న యామిని భర్తేనని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు మరణించడంతో కుమారుడు అనాధలా మారిపోయాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.