చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు వ్యక్తిని ఎంతకైనా దిగజార్చుతాయి. చాలా మంది యువతి అలాంటి వాటికి బానిసలుగా మారిపోతున్నారు. అంతేకాకుండా ఆ అలవాట్ల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. చాలా వరకు క్రైమ్ కూడా ఇలాంటి వ్యసనాల వల్లే జరుగుతున్నాయని కూడా నివేదికలు తెలుపుతున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని అరికట్టలేకపోతున్నారు. తాజాగా వెలుగుచూసిన ఒక ఘటనే అందుకు ఉదాహరణ. చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు. డబ్బు కావాలంటూ చిత్రహింసలకు గురిచేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన గురించి తెలుసుకుందాం.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా ఇటౌరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆశిష్ సింగ్ అనే వ్యక్తి అతని ఇద్దరు స్నేహితులు మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. వాళ్లు ఎంతలా దిగజారిపోయారు అంటే అవి లేకుండా ఇంక బతకలేం అని పరిస్థితికి వెళ్లిపోయారు. వారి వద్ద డబ్బులేకపోతే వాటికోసం దొంగతనాలు, దోపిడీలు చేసేందుకు కూడా సిద్ధపడిపోయారు. అలా వారికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని బెదిరించి డబ్బు లాక్కోవడం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో 15 రోజుల క్రితం ఓ 12వ తరగతి విద్యార్థితో ఆశిష్ సింగ్, అతని స్నేహితులకు గొడవ జరిగింది. వాళ్లు డబ్బుకోసం దారుణానికి ఒడిగట్టారు. ఆ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు.
ఆ విద్యార్థిని వీళ్లు డబ్బులు అడిగారు. అతని వద్ద లేవని చెప్పి వారితో వాదనకు దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆశిష్, అతని స్నేహితులు విద్యార్థిపై దాడికి దిగారు. ఒక వ్యక్తి అతని నోటిపై కాలుపెట్టి నొక్కపట్టుకోగా.. మరో ఇద్దరు కర్రలు తీసుకుని అతడిని చితకబాదారు. రెండుకాళ్లు పట్టుకునా తలకిందులుగా వేలాడదీసి దాడి చేశారు. ఆ విద్యార్థి తన వద్ద డబ్బులేదని ఎంత చెప్పినా వినలేదు. వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాథేయపడినా వారు కనికరించలేదు. మృగాల మాదిరి విచక్షణ లేకుండా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆ మొత్తం దాడిని వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్కాగా యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ సింగ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.