ప్రస్తుత రోజుల్లో చాలా మంది భార్యాభర్తల బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే విడిపోవడం, పరాయి మనుషులతో సుఖం కోసం కట్టుకున్న వాళ్లను కడతేర్చడం చేస్తున్నారు. కొందరైతే జీవిత భాగస్వామి వేధింపులు తట్టుకోలేక కూడా హత్య చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేటలో వెలుగు చూసింది. కట్టుకున్న భర్త మెడకు తాడు బిగించి ఆ భార్య హత్య చేసింది. అందుకు ఇద్దరు కూతుళ్లు, మనవడు సైతం సహకరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామ ప్రజల వాదన మాత్రం వేరేలా ఉంది. అమాయకుడైన వ్యక్తిని కుటుంబమే కలిసి హత్య చేసిందని నిరసనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య(56)- కిసనమ్మ దంపతులు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగరంలో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే కొన్నాళ్ల క్రితమే కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూతుళ్లకు అదే గ్రామానికి చెందిన వారికిచ్చి వివాహం చేశారు. బాలయ్య మాత్రం ఎప్పుడూ మద్యం తాగుతూ ఉండేవాడు. ఇంట్లో తనను సరిగా చూసుకోరు అంటూ మద్యానికి బానిసై పోయాడు. అంతేకాకుండా చిల్లరమల్లర దొంగతనాలు కూడా చేసేవాడు. ఇటీవల వీరి కుటుంబం ఏడుపాయలు వెళ్లి వస్తుండగా వీళ్లు ఉన్న ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ట్రాక్టర్ డ్రైవర్తో కలిసి బాలయ్య కూడా రూ.2.5 లక్షల పరిహారం చెల్లించాడు.
అప్పటి నుంచి బాలయ్య కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. రానురాను ఆ గొడవలు తీవ్రంగా మారాయా. గురువారం రాత్రి మరోసారి గొడవ జరగ్గా.. కిసనమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఓ తాడు తీసుకుని భర్త బాలయ్య గొంతుకు బిగించింది. ఇద్దరు కూతుళ్లు, ఓ మనవడు కలిసి ఓ వైపునకు లాగారు. ఇంట్లో ఉన్న బాలయ్యను రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. పదో తరగతి చదువుతున్న మరో మనవడు తాతను చంపకండి అంటూ ప్రాథేయపడినా కూడా వదల్లేదు. అప్పటికే బాలయ్య చనిపోయాడని ధ్రువీకరించుకున్న తర్వాత మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. అమాయకుడైన బాలయ్యను హత్య చేశారని ఇంటి ముందు గ్రామస్థులు నిరసనకు దిగారు. పోలీసులు వచ్చి గ్రామస్థులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించేందుకు ఆస్పత్రికి పంపారు. విచారణ నిమిత్తం కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.