పరీక్ష అనేది అర్హులను నిర్ణయించే ఒక ప్రక్రియ. పలానా ఉద్యోగానికి సదరు వ్యక్తులు అర్హులో కాదో అనేది పోటీ పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. అందుకే పరీక్షలు కఠినంగా నిర్వహిస్తారు. ఎవరూ మాస కాపీయింగ్ కి పాల్పడకుండా నిర్వహిస్తారు. బాగా చదువుకున్న వాళ్ళకి, అస్సలు చదవకుండా చూసి రాసే వాళ్ళకి ఒకేలా మార్కులు వస్తే అర్హులకు అన్యాయం జరుగుతుందని కఠినంగా నిర్వహిస్తారు. అయితే ఎంత కఠినంగా ఉన్నప్పటికీ చూసి రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. అలా కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కి దొరికేసేవారు కూడా ఉంటారు. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ అభ్యర్థి ఏకంగా మొబైల్ ఫోన్ లో కాపీ కొడుతూ అధికారులకు పట్టుబడ్డాడు.
ఏపీలో ఖాళీగా ఉన్న 111 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం జనవరి 8న ఆదివారం నాడు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగగా.. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగింది. అయితే విజయవాడ బెంజ్ సర్కిల్ లోని నారాయణ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఓ సచివాలయ ఉద్యోగి మాస్ కాపీయింగ్ కి పాల్పడ్డాడు. పెనమలూరు మండలంలోని పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న వెంకటేష్ అనే ఉద్యోగి.. ఉదయం నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్ 1 పరీక్షకు మొబైల్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి మరీ జవాబులు రాయడం ప్రారంభించాడు.
అది గుర్తించిన అధికారులు అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వెంకటేష్ ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు మూడు వారాల్లో వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి.. ఆగస్టు నెలలో నియామకాలు పూర్తి చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించిన విషయం తెలిసిందే. మరి పరీక్ష కేంద్రానికి ఫోన్ తీసుకురావడమే కాకుండా.. గూగుల్ చూసి గ్రూప్ 1 పరీక్ష రాయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.