నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఓ వైపు వృద్ధాప్యం, ఆర్థిక కష్టాలు.. మరోవైపు దివ్యాంగురాలైన కుమార్తె పోషణ.. ఇవన్నీ భారమనుకున్న ఆ తండ్రి తన కుమార్తెతో కలిసి గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓవైపు వృద్ధాప్యం.. మరోవైపు భార్య చనిపోయిన బాధ.. వీటన్నిటికి మించి దివ్యాంగురాలైన కుమార్తె పోషణ.. ముసురుకున్న ఆర్థిక ఇబ్బందులు.. ఇవన్నీ ఆ తండ్రిని జీవితంలో కఠినమైన నిర్ణయం వైపు నడిపించాయి. ఈ కష్టాల సుడిగుండాన్ని ఇక ఈదలేనంటూ.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తానొక్కడిని పోతే తన బిడ్డకు దిక్కెవరు అనుకొన్న ఆ తండ్రి, దివ్యాంగురాలైన ఆ కుమార్తెను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. గుండెల్ని పిండేసిన ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
మల్లాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ చారి(81), తన కూతురు ఉమారాణి(38)తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం ఆరోగ్యం బాగాలేక ఆయన భార్య తనువు చాలించింది. అప్పటి నుంచి.. ఆయనే దివ్యాంగురాలైన తన కూతురిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మరణం తర్వాత వారి ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఆదుకునే వారే కరువయ్యారు. ఎవరిని సాయం కోరినా మొండి చేయి ఎదురైంది. దీనికి తోడు మీద పడుతున్న వృద్ధాప్యం. కుమార్తెను పోషించే దారి కనిపించలేదు. ఇవన్నీ ఆయనకు మానసికంగా కృంగదీశాయి. ఇక బ్రతికి లాభం లేదనుకున్న ఆ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 7 గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
రైల్వే ట్రాక్పై ఇద్దరి మృతదేహాలను చూసిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో మల్లాపూర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఎవరైనా ముందుకొచ్చింటే.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునే వారు కాదని వాపోయారు. ఈ విషాద ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.