మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్తపై కోపాన్ని ఓ భార్య కన్న పిల్లలపై తీర్చుకుంది. తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? అది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహడ్ గ్రామం. ఇక్కడే మైబు, రమాదేవి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై ముగ్గురు పిల్లలు జన్మించారు. భర్త మైబు తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
అయితే ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో ఈ దంపతులు పొట్టచేతబట్టి పిల్లలతో పాటు హైదరాబాద్ కు పయనమయ్యారు. ఇక ఇక్కడే కొన్నాళ్ల పాటు భర్త తాపీ మేస్త్రీగా పని చేస్తూ కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి భర్త మైబు ప్రవర్తనలో మార్పొచ్చి కుటుంబాన్ని పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. పిల్లలు ఉన్నారు, ఇలా అయితే మన సంసారం ముందుకు సాగదని భార్య ఎన్నోసార్లు భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన రమాదేవికి బతుకు మీద విరక్తి కలిగింది. ఏం చేయాలో అర్థం కాని రమాదేవి శనివారం ఉదయం తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని సొంతూరు కాకర్లపహడ్ కు వెళ్లింది.
అయితే రమాదేవి ఊళ్లోకి వెళ్లకుండా మార్గమధ్యలో దిగి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ చెరువు వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లాక రమాదేవి తన ముగ్గురు పిల్లలను నీళ్లల్లోకి తీసుకెళ్లింది. భయంగా ఉంది అమ్మా.. అంటూ పిల్లలు అరుపులు, కేకలు వేస్తున్నారు. ఇక ఆ మహిళ మాత్రం ఏడుస్తూ తన ముగ్గురు పిల్లలను మరింత నీటి లోపలికి తీసుకెళ్లింది. దీంతో భయంతో పెద్ద కూతురు ఒడ్డున ఉన్న ఓ ముళ్లపొదను పట్టుకుని రక్షించండి అంటూ కేకలు వేసింది. ఈ లోపే రమాదేవి మిగతా ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి ఆ బాలికను రక్షించారు. అనంతరం ఆ బాలికను చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న భర్త మైబు తన కూతురి వద్దకు చేరుకున్నాడు. కూతురు మరణవార్త రమాదేవి తల్లిదండ్రులకు తెలియడంతో తల్లడిల్లిపోయారు. మా అల్లుడు మైబు ప్రవర్తన కారణంగానే మా కూతురు రామాదేవి, తన ఇద్దరు పిల్లలు మరణించారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.