LED TV: కాదేదీ పేలటానికి అనర్హం అన్నట్లు తయారైంది ఎలక్ట్రానిక్ వస్తువుల పరిస్థితి. టీవీలు, ఫ్రిడ్జిలు, బైకులు, వాచ్లు, సెల్ఫోన్లు ఇలా ఏవి పడితే అవి పేలుతున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్లో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. టీవీ చూస్తుండగా ఆ టీవీ పేలింది. ఈ ఘటనలో 16 ఏళ్ల కుర్రాడు మృత్యువాతపడ్డాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్లోని హర్షా విహార్కు చెందిన అమరేంద్ర తన తల్లి, అక్క, ఓ మిత్రుడితో కలిసి మంగళవారం ఇంట్లో టీవీ చూస్తున్నాడు. మొత్తం నలుగురు వ్యక్తులు ఎంతో ఆసక్తిగా టీవీ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఎల్ఈడీ టీవీ పేలింది. ఆ పేలడం కూడా పెద్ద బాంబు పేలిన శబ్ధంతో పేలింది.
ఇళ్లు మొత్తం ధ్వంసం అయింది. ఆ శబ్ధం విన్న ఇంటి పక్క వాళ్లు భయపడిపోయారు. కొద్దిసేపటి తర్వాత అమరేంద్ర ఇంటి దగ్గరకు వచ్చారు. ఇళ్లు మొత్తం ధ్వంసమై ఉంది. ఇంట్లోని సామాన్లు కూడా పాడై కనిపించాయి. పొరిగింటి వాళ్లు అక్కడే గాయాలతో పడి ఉన్న అమరేంద్రతో పాటు మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమరేంద్ర కన్నుమూశాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ ఎల్ఈడీ టీవీ ఎందుకు పేలిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఇలాంటి ఘటనలు జరగటం అత్యంత అరుదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.