సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. మనం ఉన్నది సమాజంలోనా.. లేక అడవిలోనా అనే అనుమానం కలగక మానదు. పరాయి మగాడి సుఖం కోసం అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తనే కడతేర్చిన ఓ కసాయి భార్య కథ ఇది. లకావత్ భారతి అలియాస్ సుజాత, లకావత్ కొంరెల్లి ఇద్దరు భార్యా భర్తలు. వీరి స్వస్థలం జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంతపూర్ గ్రామం. వీరిద్దరు జీహెచ్ఎంసీలో రోజూవారి కూలీలుగా పనిచేస్తూ.. సికింద్రాబాద్ లో నామలగుండు ఏరియాలో నివాసం ఉంటున్నారు. వీరి పచ్చని కాపురంలో ఓ పెళ్లి వేడుక చిచ్చురేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దరావత్ ప్రవీణ్ డీజే ప్లేయర్.. పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు డీజే ప్లేయర్ గా పనికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ వివాహ వేడుకకి వెళ్లాడు. అక్కడ అతడికి సుజాతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా పెరగడంతో అది అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొన్ని నెలలుగా వీరి వ్యవహారం సజావుగానే సాగుతోంది. ఈ క్రమంలోనే సుజాత ప్రవర్తన మీద కొంరెల్లికి అనుమానం వచ్చింది. ఆమె బండారాన్ని బయటపెట్టాలని ఓ ప్లాన్ వేశాడు. సొంత ఊరికి వెళ్తున్నా.. అని భార్యకు చెప్పి బయలు దేరాడు. ఇక అతడు బయలు దేరిందే అదునుగా చూసిన సుజాత తన ప్రియుడు ప్రవీణ్ కు కాల్ చేసి ఇంటికి రమ్మంది. ఆ రోజు రాత్రి కూడా ప్రవీణ్ సుజాత ఇంట్లోనే ఉన్నాడు. తన భర్త ఎలాగో రాడు అనుకున్న సుజాతకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు కొంరెల్లి. ప్లాన్ ప్రకారమే సడెన్ గా ఇంట్లోకి వచ్చాడు. బెడురూంలో తన భార్యని ప్రవీణ్ తో అసభ్యరీతిలో చూసిన కొంరెల్లి హాతాశుడయ్యాడు.
ఇక తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఇద్దరూ కలిసి కొంరెల్లి మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా బాడీని బైక్ పై వరంగల్ హైవేపైకి తీసుకొచ్చారు. మార్గం మధ్యలో భువనగిరి సమీపాన అనంతారం గ్రామం దగ్గరిలోని ఓ బ్రిడ్జిపై నుంచి శవాన్ని కిందపడేశారు. ఈ హత్యను వారు యాక్సిడెంట్ చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. అతడి మరణం తర్వాత సుజాత ప్రవర్తనపై అనుమానం వచ్చిన కెంరెల్లి కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి తీగను లాగారు.. దాంతో డొంకంతా కదిలింది. చేసిన హత్యను ప్రవీణ్, సుజాతలు ఒప్పుకున్నారు. దాంతో వారిని అరెస్ట్ చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన చున్నీ, బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.