“క్రైమ్ చావదు.. దాని రూపం మార్చుకుంటుంది అంతే..” సత్యా సినిమాలో రామ్ గోపాల్ వర్మ చెప్పిన డైలాగ్ ఇది. అవును ఇది అక్షరాల నిజం. దేశంలో రోజురోజుకు కొత్త రకంగా క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైద్రాబాద్ లో జరిగిన సంఘటన చిన్నపాటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి ఏ మాత్రం తీసిపోదనే చెప్పాలి. కేజీ బంగారాన్ని రూ. 40 లక్షలకే ఇప్పిస్తానని చెప్పాడో రియల్ ఎస్టేట్ బ్రోకర్.. దాన్ని నిజమే అని నమ్మాడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లూరి వెంకటేశ్వర్లు.. సరూర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. మహేశ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్.. వీరిద్దరికి వృత్తి రీత్యా 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అదీ కాక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే డబ్బు ప్రవాహం భారీగా ఉంటుంది. ఆ డబ్బును చూసే మహేశ్ కు కన్ను కుట్టింది. ఎలాగైనా వెంకటేశ్వర్లు దగ్గర నుంచి భారీగా డబ్బు కొట్టేయాలని మహేశ్ ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే పక్కాగా ప్లాన్ గీసీ దాన్ని అమలు పరిచాడు. ఇక బంగారం అంటే వెంకటేశ్వర్లుకు బాగా ఇష్టం అని గ్రహించిన మహేశ్.. తనకు తెలిసిన వారి దగ్గర కేజీల కొద్ది గోల్డ్ ఉందని కేజీ రూ.40 లక్షలకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. అదీ కాక వాట్సాప్ లో బంగారం ఫొటోలను సైతం అతడికి చూపించాడు.
అయితే ఇద్దరి మధ్య ఉన్న పరిచయంతో, ఫొటోలను చూడటంతో అతడు మహేశ్ ను నమ్మాడు. ప్లాన్ అమలు చేసిన మహేశ్.. ఈ రోజు బంగారంతో నా మనుషులు నీ దగ్గరికి వస్తారని వెంకటేశ్వర్లు కు తెలిపాడు. డబ్బుతో వ్యాపారి రడీగా ఉన్నాడు. ప్రసన్న, కనకారావు అనే ఇద్దరు ఓ సూట్ కేసుతో వెంకటేశ్వర్లు ఇంటి దగ్గరికి వెళ్లారు. అతడు రూ.60 లక్షల డబ్బు ఇవ్వగానే కేటుగాళ్లు తమ సూట్ కేసులో పెట్టుకున్నారు. ఇక తమ ముఠా సభ్యులకు ఫోన్ చేస్తున్నట్లు నటించి బంగారం తెమ్మన్నారు. సభ్యులు ఎంతకీ రాకపోడంతో ఏదో పొరపాటు జరిగింది.. మేం బంగారం తెచ్చే మీ డబ్బులు తీసుకుపోతాం అని అతడి డబ్బులు అతడికి ఇచ్చారు. ఇక్కడే ఓ ప్లాన్ ను వారు అంతకు ముందే అమలు జరిపారు.
బాధితుడి నుంచి తీసుకున్న డబ్బు కట్టలు ఎలా ప్యాక్ చేశాడో.. అలానే కేటుగాళ్లు కూడా మరో డూప్లీకేట్ డబ్బు ప్యాకెట్ ను అప్పటికే తమ సూట్ కేసులో పెట్టుకొచ్చారు. దాన్ని బాధితుడు గమనించలేదు. తీరా వాళ్లు వెళ్లాక బ్యాగ్ ను ఓపెన్ చేసి చూస్తే.. అందులో పేపర్ బండిల్స్ నింపిన కట్టలు కనిపించాయి. దీంతో కంగుతిన్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా కేటుగాళ్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మెుత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.45.10 లక్షలను రికవరీ చేశారు. కేసును త్వరగా ఛేదించిన ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీమ్ ను సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.