మ్యాట్రిమోనీ సైట్ ని ఆసరాగా చేసుకొని మోసానికి పాల్పడుతున్న బీటెక్ గ్రాడ్యుయేట్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాల్ చవాన్(34), తాను పెద్ద వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ పెళ్లి చేసుకుంటాననే సాకుతో 35-40 మందిని మోసం చేశాడు.
వివరాల్లోకెళితే.. నిందితుడు చవాన్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా గతేడాది కుంజుర్మార్గ్కు చెందిన 28 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను పారిశ్రామికవేత్తగా చెప్పుకుంటూ, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఫోన్లోనే మాట్లాడి మభ్యపెట్టడమే కాకుండా పెట్టుబడి పేరుతో మహిళ నుంచి రూ. 2.25 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అయితే, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 35 నుంచి 40 మంది మహిళలను మోసం చేశాడు. బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చవాన్పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు కళ్యాణ్లోని ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, చవాన్ అరెస్ట్ సినిమాటిక్గా జరిగింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. డెలివరీ బాయ్గా నటిస్తూ హోటల్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి, చవాన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
చవాన్ సోషల్ మీడియాను అవకాశంగా చేసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రమ్, వాట్సాప్ లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మహిళలలో పరిచయాలు పెంచుకునేవాడని పోలీసులు తెలిపారు. అలా తనకు పరిచయం అయిన మహిళలను పెళ్లి చేసుకుంటానని చెప్పి వారి నుంచి డబ్బులు గుంజేవాడన్నారు. గడిచిన రెండేళ్లలో చవాన్ 35-40 మంది మహిళల నుంచి రూ. 15-20 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు.