నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, భార్యను భర్త చంపడం.. భర్తను భార్య చంపడం లాంటి సంఘటనలు రాజ్యమేలుతున్నాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి వార్తలనే మనం వింటూ ఉంటాం. అన్యోన్య దాంపత్యం అనే పదమే నేటి కాలంలో బూతుగా తయ్యారు అయ్యింది. ఇలాంటి రోజుల్లో అన్యోన్య దాంపత్యానికి మరో పేరుగా నిలిచారు ఈ దంపతులు. తల్లిదండ్రులు కాబోతున్నాం అన్న సంతోషం వారి కళ్లలో వెలిగిపోతోంది. కానీ అంతలోనే విధికి వారిపై కన్నుకుట్టింది. ఆ భార్యా భర్తలను విడదీసింది. ఈ ఎడబాటును తట్టుకోలేక తన ప్రాణాలను వదిలాడు ఆ భర్త. ఈ విషాద సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని జున్నూర్ తాలుకా ధోండ్ కార్వాడి నిమ్ దారి ప్రాంతానికి చెందిన రమేశ్(29), విద్య(23) లు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. విద్యకు తండ్రి లేకపోవడంతో ఆమె చదువుకు అయ్యే ఖర్చులన్నింటినీ రమేశ్ చూసుకునేవాడు. అదీ కాక ఆమె కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేవాడు. దాంతో అతడిపై మంచి అభిప్రాయం ఏర్పడింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఎనిమిది నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగడంతో రమేశ్ ఆనందానికి అవధుల్లేవ్. అదీ కాక నెల కిందటే విద్య ప్రెగ్నెంట్ కావడంతో వారి సంతోషం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే కూతురుకు బంగారు గొలుసు చేయించాలని విద్య తల్లి రమేశ్ ను కోరింది. దాంతో ఇద్దరు కలిసి నారాయణగావ్ లో నగలు కొనడానికి రమేశ్-దివ్యలు బైక్ పై బయలుదేరారు. తమకు కావాల్సిన నగలు కొనుక్కొని తిరుగుప్రయాణం అయ్యారు.
ఈ క్రమంలోనే దారిలో ట్రాఫిక్ జామ్ కావడంతో.. బైక్ దిగింది దివ్య. ఈ క్రమంలోనే అటువైపుగా చెరుకులోడుతో వస్తున్న ట్రాక్టర్ ను గుర్తించలేదు. ఆ ట్రాక్టర్ వచ్చి దివ్యను ఢీ కొట్టింది. దాంతో వెనక టైర్లకింద పడి దివ్య అక్కడికక్కడే మరణించింది. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి రమేశ్ మెంటల్ గా షాక్ కు గురయ్యాడు. దివ్య మరణంతో మూడు రోజుల పాటు ఏడుస్తూనే కూర్చున్నాడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక కుంగిపోయాడు. ఆమె లేని జీవితం నాకు అవసరం లేదని, విషం తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రమేశ్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. రోజుల వ్యవధిలోనే ఇలా ఇద్దరు మరణించడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. స్థానికులు సైతం చిలకాగోరింకల్లా ఉన్న దంపతులకు ఇలా జరగడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.