ఇన్నాళ్లు భర్తల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళల గురించి మనం విన్నాం. అయితే, ఈ ఘటనలో మాత్రం భార్యతో నిత్యం గొడవలు, అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్కు చెందిన శ్రీరాముల శ్రావణ్ కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్పేట్లోని లక్ష్మీదుర్గ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి 2019 లో జనగామకు చెందిన రవళి (26) తో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో రవళి భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయిన శ్రావణ్కుమార్ మద్యానికి బానిసయ్యాడు. అప్పులు పెరగడంతో లక్ష్మీదుర్గ కాలనీలోని తమ ఇల్లు అమ్మకానికి పెట్టాడు.
ఇది కూడా చదవండి : వ్యాక్సిన్, నెగెటివ్ రిపోర్టులు.. నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు!
ఇల్లు అమ్మకానికి పెట్టాడన్న విషయం తెలుసుకున్న రవళి అందులో తమకు వాటా ఉందని, వాటా తేలే వరకూ ఇల్లు అమ్మొద్దని పేర్కొంటూ లీగల్ నోటీసు పంపించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రావణ్కుమార్ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి, పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటి వారే కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.