ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లైన నెలకే భార్య తనను విడిచిపెట్టిపోవడంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జిల్లాకు చెందిన భాస్కర్ (28) కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో పెళ్లైన నెలరోజులకే భార్య వదిలిపెట్టి వెళ్లిపోయిందని మృతుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. అప్పటినుంచి తమ కొడుకు తీవ్ర మనోవేదన చెందేవాడని తెలిపారు.
ఎన్ని సార్లు కబురు పంపినా భార్య కాపురానికి రాకపోవడంతో భాస్కర్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో భాస్కర్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు భాస్కర్ను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడన్నారు. అనంతరం కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.