ముచ్చటగొలిపే.. ముగ్గురు పిల్లలు.. భార్యాబిడ్డలను అమితంగా ప్రేమించే భర్త.. ఎలాంటి కలతలు లేని సంసారం.. సగటు మహిళ తన వైవాహిక జీవితం ఎలా ఉండాలని ఆశిస్తుందో.. ఆమె కాపురం అలానే ఉంది. సంతోషంగా సాగుతున్న వారి జీవితాలు చూసి విధికి కన్ను కట్టుంది. ముక్కు నొప్పి రూపంలో వచ్చి.. వారి జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ముక్కు నొప్పి కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ఆ మహిళ.. తన జీవితంలో ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే.. అసలు ఆస్పత్రికే వెళ్లేది కాదేమో. కానీ విధిరాతను ఎవరు తప్పించలేరు కదా. ఆమె విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన పుట్టకోటకు చెందిన సత్తి వెంకటలక్ష్మికి కొన్నాళ్ల క్రితం ముత్తయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల నుంచి వెంకటలక్ష్మి.. ముక్కులో నొప్పి వస్తుందని.. జనవరి 6న ఖమ్మం జిల్లాలో ఉన్న ఈఎన్టీ విభాగంలో వైద్యుడిని సంప్రదించారు. ఇక పరీక్షల అనంతరం వెంకటలక్ష్మికి.. డీఎన్ఎస్(డీవియేటెడ్ నాజల్ సెప్టమ్) సమస్య ఉందని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే సర్జరీ చేస్తున్న సమయంలో.. వెంకటలక్ష్మికి హఠాత్తుగా ఆయాసం వచ్చింది. కంట్రోల్ చేసే లోపే.. ఆమె మృతి చెందింది.
ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంకటలక్ష్మికి గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ముక్కు నొప్పికి ఆపరేషన్ చేసే సమయంలోనే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. మృతి చెందిందని వెంకటలక్ష్మి తల్లి విజయ ఆరోపించింది. ఈ క్రమంలో ఆమె బంధువులతో కలిసి ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. ఐసీయూ విభాగంలో ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. వెంకటలక్ష్మికి వైద్యం చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనపై స్పందించిన వైద్య సిబ్బంది.. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యలుపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. అలానే వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.