వీళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి మనస్పర్ధలు, గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలోనే భర్త భార్యను కొడవలితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా తన కూతురిపై కూడా తండ్రి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. తాజాగా కేరళలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? కొత్తకురుశి పరిధిలోని గాంధీనగర్ తూర్పు పురాలో క్రిష్ణదాస్ (48), రజిని (37) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై చాలా ఏళ్లే అవుతుంది. ఈ దంపతులకు అనగ (13) అనే కూతురు కూడా ఉంది.
అయితే పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంసారాన్ని సాఫీగా సాగించారు. కానీ గత కొంత కాలం నుంచి మాత్రం ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు పుట్టికొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడి కూడా చేసుకున్నారు. ఈ కారణంగానే భర్త క్రిష్ణదాస్ భార్యపై కోపం పెంచుకున్నాడట. అయితే బుధవారం ఉదయం రజిని ఇంట్లో నిద్రిస్తూ ఉంది. ఇక భర్త క్రిష్ణదాస్ మాటువేసి ఇంట్లో ఉన్న పదునైన కొడవలితో భార్యపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అనంతరం పక్క గదిలో నిద్రిస్తున్న కూతురిపై కూడా తండ్రి క్రిష్ణదాస్ కత్తితో దాడి చేశాడు. ఆ బాలిక అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున ఇంట్లోకి వచ్చారు. కూతురిపై దాడి చేస్తున్న క్రిష్ణదాస్ ను స్థానికులు పట్టుకుని అతని చేతిలో ఉన్న కొడవలిని లాక్కున్నారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన అనగను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తర్వాత ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.