యుక్త వయసులో కలిగే ఆకర్షణనే ప్రేమగా భావించి.. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. ముందడుగు వేస్తున్నారు నేటి కాలం యువత. ప్రేమ మైకంలో తల్లిదండ్రులు మంచి చెప్పినా.. చెవికి ఎక్కించుకోరు. ఆ తర్వాత మోసపోయామని తెలిసి.. అటు కన్నవాళ్లకి ముఖం చూపలేక.. ప్రేమించిన వ్యక్తి చేసిన మోసం తట్టుకోలేక ప్రాణాలే తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వార్దిదరూ ప్రేమించుకుని.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణీ. మూడు రోజుల కిందటే సీమంతం కూడా చేశారు. పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ.. సంతోషంగా గడపాల్సిన సమయంలో ఆ తల్లి.. దారుణ నిర్ణయం తీసుకుంది. తన గురించి కాకపోయినా.. కనీసం కడుపులోని బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన వివరాలు..
ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరులో చోటు చేసుకుంది. శివనపుర గ్రామానికి చెందిన సౌందర్య (19) అనే మహిళ స్థానికంగా ఉన్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసేది. ఈ క్రమంలో ఆమెకు సంతోష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిసి.. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో తల్లిదండ్రుల అంగీకారం లేకుండానే పది నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సౌందర్య 8 నెలల గర్భిణీ. మూడు రోజుల క్రితమే ఆమెకు సీమంతం కూడా చేశారు. ఈ క్రమంలో సౌందర్యకు సంతోష్ గురించి ఓ భయంకరమైన నిజం తెలిసింది. తనకన్నా ముందే సంతోష్కు మరో మహిళతో వివాహం జరిగిందని తెలిసింది. ఆమెను వదిలేసి.. ఆ నిజం దాచి.. సౌందర్యను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం కాస్త తాజాగా వెలుగులోకి రావడంతో.. సౌందర్య తట్టుకోలేకపోయింది. కనీసం కడుపులోని నలుసు గురించి కూడా ఆలోచించకుండా.. దారుణ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే సౌందర్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ తనకు గతంలోనే వివాహం జరిగిందనే విషయం దాచి మోసం చేసి తమ కుమార్తెను వివాహం చేసుకున్నాడని.. పైగా మద్యం తాగి వచ్చి సౌందర్యను నిత్యం హింసించేవాడని ఆరోపించారు. తమ కుమార్తె మృతికి సంతోషే కారణమని పోలీసులుకు తెలిపారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.