మనుషుల్లో క్రూర బుద్ధి రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. కొంతమంది మనుషుల్లా కూడా ప్రవర్తించటం లేదు. నరరూప రాక్షసుల్లా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి అన్న వరసయ్యే వ్యక్తిని చంపి, తలను శరీరం నుంచి వేరుచేశాడు. ఇదే దారుణం అనుకుంటే.. అతడి మిత్రులు ఆ తలతో సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. ఈ ఘోర సంఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, కుంతి జిల్లాకు చెందిన కును ముండ అనే వ్యక్తి కుటుంబసభ్యులు పొలం పనుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
కును ముండా అనే వ్యక్తి మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. పొలం పనులు అయిపోయిన తర్వాత కును ముండ కుటుంబసభ్యులు ఇంటికి వచ్చారు. ఇంట్లో కును ముండా కనిపించలేదు. కును ముండాను అతడి తమ్ముడి వరసయ్యే సాగర్ ముండా అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి ఎత్తుకు పోయాడని గ్రామస్తులు వారికి చెప్పారు. దీంతో వారు ఊరంతా వెతికి చూశారు. ఎక్కడా కును ముండా కనిపించలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాగర్ కోసం వెతకటం మొదలుపెట్టారు. ఆదివారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
అతడితో పాటు అతడి మిత్రులను, భార్యను కూడా అరెస్ట్ చేశారు. సాగర్ ముండా.. కునును చంపేసినట్లు గుర్తించారు. అతడి తలను శరీరంనుంచి వేరు చేసినట్లు కనుగొన్నారు. కును శరీరం కుమంగ్ గోపాల్ ఫారెస్ట్లో దొరకగా.. తల అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుల్వ తుంగరీ అనే ఏరియాలో దొరికింది. పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సాగర్, అతడి మిత్రులు కును ముండా తలతో సెల్ఫీలు దిగినట్లు గుర్తించారు. మొత్తం ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓ చిన్న స్థలం కోసం ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.