నిశ్శబ్దంగా ఉండే హైదరాబాద్ మహా నగరంలో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ సైట్ 2లో భారీ చోరీ జరిగింది. ఆభరణాల తయారీ సంస్థలో విలువైన వజ్రాలు, బంగారం చోరీకి గురైంది. ఫిలింనగర్ పరిధిలో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని.. సూరత్ నుంచి బంగారం ముడి సరుకు తీసుకొచ్చి ఆభరణాలు చేయించి ఇస్తుంటారు. రోజువారీ లాగానే మంగళవారం రోజు కూడా కొన్ని ఆభరణాలు తయారీ చేసి గోల్డ్ షాపుకు మిగిలిన ముడి సరుకును లాకర్ లో పెట్టి ఇంటికి వెళ్లాడు.
అయితే బుధవారం ఉదయం షాపు తెరచి చూడగా రూ.కోటి విలువచేసే వజ్రాలు, బంగారం ముడి సరుకు కనిపించలేదు. దీంతో కంగారుపడిన పవన్.. షాపులో అన్ని చోట్ల వెతికాడు. ఫలితం లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు షాప్ వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో కోటి రూపాయల విలువ చేసే డైమండ్స్, ముడి సరుకు చోరీకి గురైనట్లు పవన్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.