ఆన్లైన్ గేమింగ్కు బానిసై ఒక సర్కారు ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కోసం ఏమీ చేయలేకపోతున్నా అంటూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మిగిలిన వివరాలు..
ఆన్లైన్ గేమింగ్ లాంటి దుర్వ్యసనాల బారిన పడి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి వల్ల కొందరు ఆర్థికంగా నష్టపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోతే.. మరికొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరిగింది. ఆన్లైన్ గేమ్లకు బానిసై డబ్బు పోగొట్టుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. డీఏఈ కాలనీలోని డి2/43 క్వార్టర్స్లో ఉంటున్న వరద శివ (31) న్యూక్లియర్ ఫ్లుయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) సంస్థలో వర్క్ అసిస్టెంట్గా ఏడేళ్లుగా పని చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రొద్దుటూరి అతడి సొంతూరు. శివకు మూడేళ్ల కింద వివాహమైంది. అతడికి భార్య ప్రభాత, ఏడాదిన్నర వయసు ఉన్న కొడుకు వేదాన్ష్ ఉన్నారు. పంటి నొప్పితో బాధపడుతున్న భార్య ప్రభాతను ట్రీట్మెంట్ కోసం ఈనెల 2న ఆమె సొంతూరు జోగులాంబ గద్వాలలోని తల్లిగారి ఇంటి దగ్గర దింపి వచ్చాడు శివ. ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న శివకు.. అదే శాపంగా మారింది. ఇలా గేమ్స్ ఆడుతూ అతడు లక్షల్లో డబ్బ పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకున్నాడు. రాత్రివేళ భర్తకు ఎన్నిసార్లు కాల్స్ చేసినా స్పందించకపోవడంతో సెక్యూరిటీకి ప్రభాత సమాచారం ఇచ్చింది.
ఆయన తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే శివ మృతి చెందాడు. ఇంట్లో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ రూ.12 లక్షలు అప్పులు చేస్తే తామే తీర్చామని.. అతడి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ను తీసుకుని చిన్న ఫోన్ ఇచ్చినా అలవాట్లలో మార్పులు రాలేదని మామ మహంకాళి శ్రీనివాసులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శివ రాసిన సూసైడ్ నోట్ అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ‘వేదాన్ష్ కోసం ఏమీ చేయలేకపోతున్నా. నా మెదడును అదుపు చేయలేకపోతున్నా. నా చావుకు నేనే కారణం. మిత్రులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి. వేరే దారి లేకే ఈ నిర్ణయం తీసుకున్నా. క్షమించండి’ అని సూసైడ్ నోట్లో శివ రాశాడని పోలీసులు తెలిపారు.