సిద్దిపేట జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం బయట దుండగులు కాల్పులు జరిపి.. దాదాపు రూ.43 లక్షల నగదుతో పరారయ్యారు. బాధితుడు చేర్యాలకు చెందిన రియల్టర్ వ్యాపారి నర్సయ్యగా గుర్తింపు. బాధితుడి వివరాల ప్రకారం.. అతను రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం లోపలికి వెళ్లాడు. డబ్బు కారులో ఉంది.. డ్రైవర్ కారులోనే ఉన్నాడు.
ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. ముందుగా డోర్ కొట్టి తలుపు తీయాలన్నారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో.. అద్దం పగలగొట్టారు. డ్రైవర్ కారు నడిపే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపారు. మొదట ఒక రౌంట్ గాల్లోకి కాల్చారు. ఆ తర్వాత రెండో రౌండ్ డ్రైవర్ తొడ భాగంలోకి దిగింది. ఆ తర్వాత రెండో వ్యక్తి కారు డోర్ ఓపెన్ చేసి డబ్బు బ్యాగ్ తో పరారయ్యారు. డ్రైవర్ వారిని వెంబడించే ప్రయత్నం చేశాడు. కాస్త దూరం వెళ్లగానే రక్తస్రావం జరిగి కారును ఆపేసినట్లు తెలిపాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ బుల్లెట్ షెల్ ను కూడా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.