తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కష్టపడి పెళ్లి చేసిన తన కూతురికి వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదనతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ద్రాక్షారామకు చెందిన తలపాగల శ్రీనివాసరావు సుజాత భార్యాభర్తలు. ఇతనికి ఓ కుమారుడు కూతురు ఈశా మాలిని ఉన్నారు. అయితే ఆయన వృత్తి రిత్యా ఫోటో గ్రాఫర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తు ఉన్నాడు. అయితే గతేడాది తన కూతురికి ఏలూరు సమీపంలోని ఫతేబాదకు చెందిన కారుపర్తి గౌతంకుమార్తో కట్న కానుకలిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు.
అయితే పెళ్లైన కొన్నాళ్లు వీరి వివాహం జీవితం బాగానే ఉన్నా కొంత కాలం తర్వాత అత్తింటి వాళ్లు అదనపు వరకట్నం కింద తన కూతురిని వేధించటం మొదలు పెట్టేవారు. ఇక విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాస రావు మాములే కదా అని వదిలేశాడు. అయితే రాను రాను తన కూతురిపై వేధింపులు ఎక్కువ అవుతుండటంతో భరించలేకపోయాడు. ఏం చేయాలో తెలియక అర్థం కానీ పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో మనస్థాపానికి గురయ్యాడు.
తాజాగా ఓ రోజు ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లుగానే ఇంట్లో ఉన్న పాయిజన్ తాగి భార్యతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఇక ఎస్సై తులసీరామ్ను కు తన కూతురికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తున్న క్రమంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక వెంటనే స్పందించిన భార్య స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తన ఇంట్లో సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తన కూతురిని వేధించిన కుటుంబ సభ్యుల పేర్లతో సహా రాసి వారిని కఠినంగా శిక్షించాలని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.