తహసీల్దార్ భూమి రిజిస్ర్టేషన్ను అడ్డుకుంటున్నారని ఓ రైతు పెట్రోలు పోసుకోబోయిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లికి చెందిన రైతు సత్తయ్యకు అదే గ్రామంలో ఎకరం పొలం ఉంది. ఇటీవల ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న సత్తయ్య తన పొలాన్ని విక్రయించేందుకు ఓ రియల్టర్తో ఒప్పందం కుదుర్చుకుని కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. భూమిని రిజిస్టర్ చేసేందుకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. సత్తయ్య భూమి విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న పక్కభూమి రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. భూ కొలతలు వేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చాడు. మరోవైపు, నాలుగు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అడ్వాన్స్ తీసుకున్న వ్యక్తి సత్తయ్యపై ఒత్తిడి పెంచాడు. రిజిస్ట్రేషన్ చేయకుంటే తన డబ్బు వెనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న సత్తయ్య రిజిస్ట్రేషన్ చేయమని కోరగా, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అక్కడే ధర్నాకు దిగాడు. దీంతో తహసీల్దార్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి, వెళ్లిపోయారు. సత్తయ్య వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అక్కడే ఉన్న పోలీసులు, కార్యాలయ సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తహసీల్దార్ ఉద్దేశ్యపూర్వకంగానే తన భూమి రిజిస్ట్రేషన్ ఆపుతున్నారని కలత చెందిన రైతు సత్తయ్య ఒంటిపై పెట్రోలు పోసుకోబోయాడు.
అక్కడే ఉన్న వారు అతడి నుంచి పెట్రోలు డబ్బాను లాక్కొని సర్దిచెప్పారు. ఈ విషయమై డీటీ రాజేందర్రెడ్డిని వివరణ కోరగా సర్వే నెంబరు 43లో కొందరి దాయాదుల పేర్లు కూడా పహాణిలో ఉన్నాయని, వారి ఫిర్యాదు మేరకే రిజిస్ట్రేషన్ ఆపామని, విచారణ చేసి ఉన్నతాధికారులు సూచనలు మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివరించారు.