ఆ ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే తమ పెళ్ళికి ఇరు కుటుంబాల వారు అంగీకరించరన్న కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలోని వినోభానగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వినోభానగర్ గ్రామానికి చెందిన తంబారపు ప్రసన్న జ్యోతి(25), అదే గ్రామానికి చెందిన కరుణాకర్ ఇద్దరికీ ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ళ క్రితమే జ్యోతి.. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి అక్కడే ఉంటూ కొత్తగూడెంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటుంది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సిరికొండ ప్రశాంత్(30) అనే లారీ డ్రైవర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ నెల 4న ఉదయం హాల్ టికెట్ తెచ్చుకుంటానని జూలూరుపాడుకు బయలుదేరింది ప్రసన్న జ్యోతి. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదే రోజు ఇద్దరూ పురుగుల మందు తాగి ఖమ్మంలోని లారీ అసోసియేషన్ ఆఫీసుకి వెళ్ళారు. ఆఫీసులో ఇద్దరూ వాంతులు చేసుకోవడంతో అక్కడున్న వారు వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకి సమాచారం అందించారు.
ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా.. ప్రశాంత్ శనివారం రాత్రి మరణించగా, ప్రసన్న జ్యోతి ఆదివారం ఉదయం మరణించింది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రశాంత్కు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా.. ప్రసన్న జ్యోతికి భర్త, ఒక బాబు ఉన్నారు. వీరి మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.