కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో బ్యాంకు మేనేజర్, ఓ ఖాతాదారుడు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. విషయం ఏంటంటే పట్ణంలోని డీసీసీబీ బ్రాంచ్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే నకిలీవి తిరిగి ఇచ్చారని ఓ ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబేడ్కర్ నగర్కు చెందిన ప్రమోద్ కుమార్ 2017లో 35.81 తులాల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.4,98,600 రుణం తీసుకున్నాడు. 2019 డిసెంబర్లో రెన్యూవల్ చేసుకున్నాడు. మొత్తం రుణం, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,02,436 కాగా గురువారం మధ్యాహ్నం చెల్లించి బంగారు ఆభరణాలు విడిపించాడు.
గంట తర్వాత మళ్లీ బ్యాంక్కు వెళ్లి బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన నగలు నకిలీవని, తనకు బంగారు నగలు ఇవ్వాలంటూ షాక్ ఇచ్చాడు. బ్యాంక్లోనే చూసుకుని అడిగితే తమకు సంబంధమని, బయటకు వెళ్లి వస్తే తమది బాధ్యత కాదంటూ మేనేజర్ మహబూబ్ తెలిపాడు. అంతా సరిగా ఉన్నట్లు బ్యాంక్ రికార్డులో ప్రమోద్ కుమార్ సంతకం కూడా చేశాడని చెప్పాడు. సాక్ష్యంగా సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నట్లు మేనేజర్ చెబుతున్నాడు. ఈ విషయంపై ఇద్దరి ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నట్లు కర్నూలు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.