ఈ రోజుల్లో దొంగలు చాలా తెలివిగా ముదిరిపోయారు. అయితే మనం ఇప్పటి వరకు జెబు దొంగలు, బంగారం దొంగలు, చైన్ స్నాచర్ దొంగతనాలు విన్నాం. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బ్రిడ్జ్ ను దొంగిలించడం, రైల్ ఇంజన్ ను ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా చూశాం. కానీ తాజాగా మాత్రం ఏకంగా దొంగలు ఓ చోట సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగుళూరు మహాదేవపురాలోని గోశాల రోడ్ ప్రాంతం. ఇక్కడే గత కొన్నేళ్ల నుంచి ఓ సెల్ టవర్ ఉండేది. అయితే ఇదే ప్రాంతానికి కొందరు వ్యక్తులు కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలని వెతికారు. ఈ క్రమంలోనే ఆ దొంగలు గోశాల రోడ్ లో ఉన్న సెల్ టవర్ ను ఎత్తుకెళ్లాలని ప్లాన్ గీశారు. ఇందులో భాగంగానే కొంతమంది కలిసి పక్లా ప్లాన్ తో అడుగులు వేశారు. ఎంతో శ్రమించి అక్కడున్న ఆ సెల్ టవర్ ను రోజుకొక పార్ట్ విప్పారు. అలా నెల రోజుల పాటు ఒక్కో పార్ట్ విప్పి 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువు కలిగిన ఆ సెల్ టవర్ ను దొంగిలించారు.
అయితే ఈ దొంగతనాన్ని కంపెనీ నిర్వాహకులు ఆలస్యంగా తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.17 లక్షల విలువ కలిగిన సెల్ టవర్ ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత కంపెనీ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సెల్ టవర్ దొంగతనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.