బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఈ దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. చిన్న నుంచి పెద్ద దాకా బిర్యానీ కోసం అల్లాడిపోతుంటారు. నాన్వెజ్ ఇష్టపడే వారితో పాటు వెజ్ను ఇష్టపడేవారికి కూడా పలు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక, బిర్యానీ ప్రియులు నోరెళ్ల బెట్టే విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో పావురం మాంసంతో తయారు చేసిన బిర్యానీలు విక్రయిస్తున్నట్లు తెలియవచ్చింది. కోళ్లను, మేకలను పెంచినట్లుగానే వాటిని కూడా పెంచి, మాంసం కోసం వినియోగిస్తుండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహారాష్ట్ర, ముంబైలోని సియోన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన హరేష్ గగ్లానీ అనే 71 ఏళ్ల వ్యక్తి ఆర్మీ నుంచి రిటైడ్ అయ్యాడు. అక్కడి ‘‘శ్రీ నరోత్తమ్ నివాస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’’లో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం హరేష్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తాను ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్ మీద అభిషేక్ సావంత్ అనే వ్యక్తి పావురాలను పెంచుతున్నాడని, అతడు ఆ పావురాల్ని పట్టి హోటళ్లకు అమ్ముతున్నాడని పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. అభిషేక్ మార్చి 2022నుంచి మే 2022 మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో పావురాలను పెంచాడు. వాటిని దగ్గరలోని హోటళ్లకు అమ్మాడు. వారు వాటిని కోసి బిర్యానీల్లో వాడారు. ఇందుకోసం అభిషేక్ అతడి డ్రైవర్ సహాయం తీసుకునే వాడు. ఇద్దరూ కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ల దగ్గరకు వెళ్లి పావురాలను అమ్మేవాళ్లు. అభిషేక్ పావురాలను పెంచుతున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ ఛైర్మన్తో పాటు సెక్రటరీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు.