Crime News: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిపై జనం విరుచుకుపడ్డారు. చెట్టుకు కట్టేసి మరీ అతడ్ని కొట్టి చంపారు. ఈ సంఘటన బిహార్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, కతిహార్లోని హసన్జంగ్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక అక్టోబర్ 5న తల్లితో పాటు మంచంపై నిద్రపోతోంది. తల్లి అర్థరాత్రి లేచిచూసే సరికి బాలిక కనిపించలేదు. దీంతో ఇంట్లోని వారంతా బాలిక కోసం వెతకటం ప్రారంభించారు. అలా వీధి మొత్తం వెతుకుతుండగా గ్యాస్ గోడౌన్ దగ్గర బాలిక కనిపించింది. అయితే, బాలికతో పాటు ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరి ఒంటిపై బట్టలేవు. బాలిక కుటుంబసభ్యుల్ని చూడగానే ఆ వ్యక్తి పారిపోయాడు. దీంతో తల్లిదండ్రులు బాలికను ఇంటి తీసుకెళ్లారు. ఇంటికి పోయిన తర్వాత బాలిక అసలేం జరిగిందో చెప్పింది.
సదరు వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు గ్రామస్తులు కూడా జతకలిశారు. అందరూ కలిసి నిందితుడి కోసం గాలించారు. ఓ చోట అతడ్ని వెతికి పట్టుకున్నారు. ఇంటి దగ్గరకు తీసుకువచ్చారు. అతడ్ని చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని కాపాడి, ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలోనే అతడు మృత్యువాతపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు నిందితుడు అంతకు ముందు కూడా ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.