నా తమ్ముడికి పెళ్లి చేసి తప్పు చేశాను. నా తమ్ముడి భార్య వేధింపులను తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నా చావుకి కొంతమంది కారణం. భర్త, తమ్ముడు కలిసి నా అంత్యక్రియలు జరపాలి.. అంటూ ఓ మహిళ వీడియోలో చివరి సారిగా మాట్లాడిన మాటలు ఇవి. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది బెంగుళూరు బ్యాటరాయనపుర పరిధిలోని హొసగుడ్డహళ్లి. ఇదే గ్రామంలో శివలింగేగౌడ, లక్ష్మమ్మ(48) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మదన్ (13), నవీన్ అనే కుమారులు ఉన్నారు. భర్త గాంధీనగరలో ఓ హోటల్ ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దీంతో అప్పటి వరకు వీరి కాపురం ఎంతో ఆనందంగా సాగుతోంది. ఇదిలా ఉంటే లక్ష్మమ్మకు సిద్దేగౌడ అనే తమ్ముడు ఉన్నాడు. పెళ్లి వయసు రావడంతో పెద్ద దిక్కుగా మారి తన తమ్ముడికి రంజిత అనే అమ్మాయితో గతంలో వివాహం జరిపించింది.
పెళ్లైన కొన్ని రోజులు మాత్రమే ఈ దంపతులు సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులు గడిచాక భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలోనే సిద్దేగౌడ భార్య రజింత భర్తపై వరకట్నం, గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంజిత భర్త సిద్దేగౌడను అరెస్ట్ చేశారు. ఇక రంజిత.. భర్తపైనే కాకుండా ఆడ పడుచు లక్ష్మమ్మ, ఆమె భర్త శివలింగేగౌడతో పాటు మరికొంత మందిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే కాక లక్ష్మమ్మ తమ్ముడి భార్య రంజిత ఆడ పడుచైన లక్ష్మమ్మను కూడా తీవ్ర వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక వీటన్నిటినీ భరించలేకపోయిన లక్ష్మమ్మ తనలో తాను బాధ పడుతూ, కుమిలిపోతూ ఉండేది. దీంతో జీవితంపై విరక్తి చెందిన లక్ష్మమ్మ బతకడం లాభం లేదనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇటీవల లక్ష్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చిన్న కుమారుడైన మదన్ ను గొంతు పిసికి చంపి అనంతరం తాను ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ క్రమంలోనే భర్త శివలింగేగౌడ భార్యకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా లక్ష్మమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
దీంతో అనుమానం వచ్చిన భర్త పక్కింట్లో వాళ్లకు ఫోన్ చేసి తెలుసుకోగా ఆమె సూసైడ్ చేసుకుందని తెలిపారు. భార్య, కొడుకు మరణించడంతో భర్త కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తర్వాత ఆమె చివరి సారిగా మాట్లాడిన వీడియో రికార్డ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.