జనాలకి మాయ మాటలు చెబుతూ ఓ కిలాడీ దంపతులు లక్షల్లో దోచుకున్నారు. మీకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ అమాయకపు జనాలను నమ్మించి లక్షల్లో పైగా పోగేసుకున్నారు. ఇలా ఎంతో మందిని నమ్మించి మోసం చేసిన ఈ జంట ఇప్పుడు కటకటాల పాలయ్యారు. బెంగుళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కిలాడీ దంపతుల వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. తాజాగా వెలుగు చూసిన వీరి సరికొత్త దందా గురించి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
మోహన్ దాస్, ధనుష్య ఇద్దరు దంపతులు. బెంగుళూరు ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న ఈ దంపతులకు గతంలో వివాహం జరిగింది. అయితే ఈ కిలాడీ దంపతులు సులువుగా, తెలివిగా డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచలను చేశారు. ఇందు కోసం అమాయక ప్రజలను మోసం చేసి లక్షలు పోగు చేసుకోవాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ధనుష్య గతంలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లి… నా భర్త ఎయిర్ పోర్టు కస్టమ్స్ లో పని చేస్తాడని, జప్తు చేసి ఉంచిన బంగారాన్ని తక్కువ ధరకు తీసుకొస్తాడని మాయ మాటలు వల్లించింది.
ఇలా ధనుష్య మాయలో పడిపోయిన స్నేహ దాదాపుగా రూ.68 లక్షల వరకు ధనుష్య దంపతులకు అందించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ దంపతులు ఇంతటితో ఆగలేదు. అకాడమీలో పని చేస్తున్న ఉద్యోగులను సైతం నమ్మించి వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బును కాజేశారు. అలా కొన్ని రోజులు గడిచింది. స్నేహ ధనుష్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్నేహ, అకాడమిలో ఉద్యోగులు అంతా కలిసి వారి కోసం కొన్ని రోజులు వేచి చూశారు.
దనుష్య దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ కిలాడీ దంపతులు మనల్ని మోసం చేశారంటూ ఎట్టకేలకు వారంతా తెలుసుకున్నారు. ఇక వెంటనే స్నేహ, అకాడమీ ఉద్యోగులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతులను ఎట్టకేలకు పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి సుమారుగా 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ దంపతులు ఇక్కడే కాకుండా స్థానికంగా ఉండే జనాలను ఎంతో మంది మోసం చేసి డబ్బులు గుంజినట్లుగా తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.