డేటా అంతా ఫోన్లో నిక్షిప్తం చేయడంతో సైబర్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో మన సమాచారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాల్లో నుండి డబ్బును మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఒక చిన్న మేసేజ్, లేదా కాల్తో చిటికెలో మన ఖాతాల్లోని డబ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా..
ప్రజలను మోసం చేసేందుకు ఇటీవల ఫోన్ ఓ ఆయుధంగా తయారైంది. డేటా అంతా ఫోన్లో నిక్షిప్తం చేయడంతో సైబర్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో మన సమాచారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాల్లో నుండి డబ్బును మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఒక చిన్న మేసేజ్, లేదా కాల్తో చిటికెలో మన ఖాతాల్లోని డబ్బును స్వాహా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ప్రజలు అప్రమత్తమౌతున్న సమయంలో సరికొత్త విధానంలో మోసానికి తెర లేపుతున్నారు. లోన్స్, జాబ్ అవకాశాలు, లాటరీలంటూ సరికొత్త స్కెచ్తో మోసానికి పాల్పడుతున్నారు మాయగాళ్లు. దీనికి ఆయుధంగా మారింది నిత్యం మనం వినియోగించే వాట్సప్.
వాట్సప్ ద్వారా నయా దందాకు తెర లేపారు సైబర్ నేరగాళ్లు. గత 10 రోజులుగా ఇంటర్నేషనల్ నంబర్ల నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు మేసేజ్లు, కాల్స్ చేస్తున్నారు. లోన్స్, ఉద్యోగ అవకాశాలు, టాస్కుల పేరుతో ట్రాప్ చేస్తున్నారు. ఇటువంటి కాల్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కాల్స్ మలేషియా, ఇథియోపియా, వియత్నం దేశాల ఐఎస్డీ కోడ్స్తో వస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. పదేపదే ఇవే నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తుండటంతో ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ నంబర్ల నుండి అమ్మాయిల పేరుతో కాల్స్, మేసేజ్ లు రాగా.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇదొక పెద్ద స్కామ్ అని, వీటికి రెస్పాన్స్ కావొద్దని పోలీసులు చెబుతున్నారు.
దేశంలో రోజుకు లక్షల్లో ఈ కాల్స్ వస్తున్నాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఇలాంటి కాల్స్ను వేలాది మందికి వచ్చినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. మిస్డ్ కాల్స్, ఆడియో కాల్స్ ఎక్కువగా వచ్చాయట. వాట్సాప్ VoIP(Voice over Internet Protocol) నెట్వర్క్ ద్వారా వర్క్ అవుతుంది. వాట్సప్ అనే యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ మన వాళ్లు ఉన్నా ఫోన్ చేసుకోవచ్చు, వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే దీనికి డేటా తప్పనిసరి. అందుకే కేటుగాళ్లు ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా మోసాలకు తెగబడుతున్నారు. విదేశీ కోడ్లతో ఫోన్ వచ్చినంత మాత్రమే.. అది ఇంటర్నేషనల్ కాల్ అనడానికి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల పలు ఏజెన్సీలు వాట్సాప్ కాల్, మెసేజ్ల కోసం మన సిటీల్లో ఇంటర్నేషనల్ నంబర్స్ విక్రయిస్తున్నాయి. అందుకే తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చేస్తే మాయమాటలతో ఖాతాను ఖాళీ చేస్తారని, బ్లాక్ మెయిల్ చేయోచ్చునని తెలిపారు.