రాచనగరంలో యువతిపై గ్యాంగ్ రేప్ కేసు మలుపులు తిరుగుతోంది. మైసూరులోని చాముండి కొండ తప్పలిలోని లలితాద్రిపురం సమీపంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కరుడుగట్టిన నేరస్తులుగా భావిస్తున్నారు. మంగళవారం రాత్రి యువతి, యువకుడు కలిసుండగా, యువకుడిని కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా యువతి మిత్రుడికి ఫోన్ చేసి రూ.3 లక్షలు డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులు షాకయ్యారు. గ్యాంగ్ రేప్ దృశ్యాలను రికార్డు చేశామని అడిగిన డబ్బు ఇవ్వకుపోతే సోషల్ మీడియా, ఇంటర్నెట్లో పెట్టేస్తామని హెచ్చరించినట్లు యువకుడు తెలిపాడు. నిందితుల ప్రవర్తన చూస్తుంటే వీళ్లు పాత నేరస్తులే అయి ఉంటారని భావిస్తున్నారు.
డబ్బు డిమాండ్ చేయడమే కాదు, పోలీసులకు సమాచారమిచ్చినా, వారిపై కేసు నమోదైనా రేప్ దృశ్యాలు ఇంటర్నెట్లో పెట్టేస్తామని బెదిరించినట్లు యువకుడు తెలిపాడు. బాధితురాలి ప్రాణాలకు ప్రమాదం లేదని, చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు దుండగుల వివరాలు అడగ్గా వారు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారని యువతి స్నేహితుడు చెప్పాడు. ఘటనపై ఆళణహళ్లి పీఎస్లో కేసు నమోదైంది. చుట్టుపక్కలున్న సెల్ఫోన్ టవర్లలో నమోదైన నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 24 రాత్రి 7.30 గంటల సమయంలో దారుణం జరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ల నంబర్లను ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకుంటామని పోలీసు కమిషనర్ చంద్రగుప్త తెలిపారు.
ఈ ఘటనను సీరియస్గా పరిగణించినట్లు హోంమంత్రి అగర జ్ణానేంద్ర తెలిపారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె షాక్లో ఉన్నందున ఆమె నుంచి వివరాలను సేకరించడం సాధ్యం కావడం లేదన్నారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు మైసూరులోనే ఉండి పనిచేస్తున్నారని తెలిపారు. పర్యాటక కేంద్రంలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదని, వారి హయాంలో జరగలేదా? అని ప్రశ్నించారు. ‘అసలు ఆ సమయంలో యువతి, యువకుడు అక్కడ ఎందుకున్నారు. వారు అక్కడికి వెళ్లకుంటే ఈ ఘటన జరిగేది కాదు కదా?’ అని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయని తెలిసిందే.