భార్య ఎవరితోనో వెళ్లిపోయిందనే మనోవేదనకు గురయ్యాడో భర్త. తన భార్య అలా వెళ్లిపోవడానికి అత్తింటివారే కారణం అని భావించి ఇద్దరు బంధువులను హత్యచేశాడు. 2006లో ఈ హత్య కేసుల్లో అతను చర్లపల్లి జైల్లో జీవితఖైదు అనుభవించి 15 రోజుల క్రితం విడుదలయ్యాడు. భార్య అలా చేసిన కోపానికి ఇద్దరి హత్య చేసి ఏళ్లపాటు జైల్లో ఉంటే కొంచెం అన్న మార్పు వచ్చిందనుకుంటే పోరపాటే.
ఇప్పుడు మరీ డేంజర్గా మారిపోయాడు. సైకోలా మారి.. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని కోరికలను తీర్చకపోతే ఆ మహిళలను హత్య చేశాడు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్లో ఉంటున్న లక్ష్మి అనే మహిళకు షాబుద్దిన్కు గతంలో పరిచయం ఉంది. ఆమెను కలిసిన షాబుద్దిన్ తన కోరిక తీర్చలేదని అతి దారుణంగా హత్య చేసి మెడకు చీర బిగించి హత్య చేశాడు. అదే రోజు రాత్రికి దుద్దెడ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న మర్కుక్ మండలానికి చెందిన స్వరూప అనే మహిళ అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఉండగా మద్యం మత్తులో షాబుద్దిన్ తన కోరిక తీర్చాలంటూ అడిగాడు.
ఆ మహిళ అందుకు నిరాకరించడంతో ఆమెను రాయితో నుదిటిపై కొట్టి హత్య చేశాడు. ఇలాంటి దారుణాలు మరికొన్ని జరగకముందే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న కల్లు కాంపౌండ్లో కల్లు తాగడానికి నిందితుడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సిద్దిపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ రెండు హత్యల వివరాలు ఒప్పుకున్నట్లు సమాచారం.