జీవితంలో ఎదురైన చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొలేక యువతరం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి, నమ్ముకున్నవారికి కన్నీళ్లు మిగిలిస్తూ తనువు చాలిస్తున్నారు. వారి దృష్టిలో సమస్య పెద్దదే కావచ్చు, కానీ దానికి బలవన్మరణం పరిష్కరం అయితే కాదు అనేది వాస్తవం. కేవలం క్షణికావేశంలో కొంతమంది తమ జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇలాంటి ఘటనే నాచారం పరిధితో సోమవారం చోటు చేసుకుంది.
చూసేందుకు లక్షణంగా ఉన్నా అనారోగ్యం, పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓల్డ్ మల్లాపూర్కు చెందిన తొర్రి నర్సింహ కూతురు అశ్విని(29) గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి తోడు పెళ్లి సంబంధాలు రావడం లేదనే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరు బాధ్యలు కారని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.