Durga Matha Immersion: దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజించిన భక్తులు చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్లలో పెను విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకోవటంతో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిన్న పశ్చిమ బెంగాల్లోని జైల్పయ్గురికి చెందిన 70 మంది భక్తులు దుర్గామాత నిమజ్జనానికి మల్ నది దగ్గరకు వెళ్లారు. రాత్రి 9.15 గంటల సమయంలో వాళ్లు నదిలోకి దిగి నిమజ్జనం చేస్తూ ఉన్నారు.
ఇంతలో పైనుంచి వేగంగా వరద నీరు దూసుకు వచ్చింది. దీంతో నదిలో ఉన్న వారిలో కొంతమంది కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారిలో 7 గురు మృత్యువాత పడ్డారు. సహాయక సిబ్బంది 60 మందిని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చింది. వీరిలో 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇక, ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో దుర్గామాత నిమజ్జనం చేస్తుండగా 15 ఏళ్ల ఓ బాలుడు, 19, 22 ఏళ్ల యువకులు యమునా నదిలో కొట్టుకుపోయారు. వీరిలో ఒక్కరి ఆచూకీ కూడా ఇంత వరకు లభించకపోవటం విషాదం. రాజస్తాన్, అజ్మిర్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
వరద నీటిలో 6 గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. సహాయక చర్యల్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ప్రతీ సంవత్సరం లాగే గణేష్, దుర్గామాత నిమజ్జన కార్యక్రమాల్లో అపశ్రుతులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రతి ఏటా వంద మంది దాకా మరణిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఒక్క మహారాష్ట్రలోనే 20 మంది దాకా మృత్యువాతపడ్డారు.
#WATCH | WB: Flash flood hits Mal River in Jalpaiguri during Durga Visarjan; 7 people dead, several feared missing
Many people were trapped in river & many washed away. Bodies of 7 people were recovered. NDRF& civil defence deployed; rescue underway: Jalpaiguri SP Debarshi Dutta pic.twitter.com/cRT3nnp7Gz
— ANI (@ANI) October 5, 2022