సాధారణంగా ఒక నెల జీతాన్ని బోనస్ గా ప్రకటిస్తేనే ఉద్యోగులు ఎంతో సంతోష పడిపోతారు. అలాంటిది ఒక కంపెనీ వారి ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల జీతాన్ని బోనస్ గా ప్రకటించింది. మొదట 50 నెలల జీతాన్ని ప్రకటించగా.. తర్వాత మిడ్ ఇయర్ బోనస్ గా మరో 11 నెలల జీతాన్ని ప్రకటించింది.
సాధారణంగా కంపెనీ వృద్ధి కోసం ఉద్యోగులు పని చేస్తారు. ఉద్యోగులు ఆర్థికంగా బలపడేలా, అభివృద్ధి చెందేందుకు కంపెనీలు సాయపడుతూ ఉంటాయి. అయితే ఇది ఎప్పుడూ కాస్త పరిమితంగానే ఉంటుంది. ఏ కంపెనీ కూడా తమ లాభాలను ఉద్యోగులకు పంచాలి అని చూడవు. అలాగే రిస్క్ వచ్చినప్పుడు ఉద్యోగులను తప్పుబట్టరు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కంపెనీ మాత్రం తమ లాభాలకు ఉద్యోగులే కారణం అంటూ వారికి ఊహించలేని రీతిలో బోనస్ లు ప్రకటించింది. ఒక నెల రెండు నెలలు కాదండోయ్.. ఏకంగా ఐదేళ్ల జీతాన్ని ఉద్యోగులకు బోనస్ గా ఇవ్వనున్నారు. ఈ వార్త తెలిసి యావత్ ప్రపంచమే విస్తుపోయింది.
ఏ కంపెనీ అయినా ఒకటి రెండు నెలలు జీతాన్ని బోనస్ గా ఇస్తాయి. కానీ, తైవాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ షిప్పింగ్ కంపెనీ మాత్రం వారి ఉద్యోగులకు ఏకంగా 50 నెలల జీతాన్ని బోనస్ గా ప్రకటించింది. కరోనా సమయంలో సూయిజ్ కాలువలో చిక్కుకుని ఇటీవల ఎవర్ గ్రీన్ కంపెనీ 50 నెలల జీతాన్ని బోనస్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 10 నుంచి 11 నెలల జీతాన్ని మిడ్ ఇయర్ బోనస్ గా ప్రకటించింది. అంటే మొత్తంగా ఐదేళ్ల జీతాన్ని ఉద్యోగులకు బోనస్ గా అందిస్తున్నారు. ఉద్యోగులకు కేవలం మిడ్ ఇయర్ బోనస్ ఇచ్చేందుకే ఆ సంస్థకు దాదాపు 94 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
కరోనా సమయంలో సూయిజ్ కెనాల్ లో ఓ భారీ నౌక ఇరుక్కుంది గుర్తుందా? అది వీళ్ల కంపెనీ నౌకనే. ఆ సందర్భంలో లాక్ డౌన్ కారణంగా ఈ కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి. లాక్ డౌన్ తర్వాత గత రెండేళ్ల కాలంలో ఎవర్ గ్రీన్ కంపెనీ దాదాపు 39.92 శాతం మేర లాభాలను ఆర్జించింది. ఇదంతా ఉద్యోగుల వల్లే సాధ్యమైందంటూ ఆ కంపెనీ ఉద్యోగులకు బోనస్ లు ప్రకటించింది. తైవాన్ లో ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎవర్ గ్రీన్ కంపెనీ ఎప్పుడూ లేని విధంగా NT334 బిలియన్ డాలర్ల లాభాలు సాధించింది. ఈ కంపెనీలో ఉద్యోగుల వార్షిక జీతం 29,545 డాలర్ల నుంచి 1,14,823 డాలర్ల వరకు ఉంటుంది. 3,100 మంది ఉద్యోగులకు ఈ బోనస్ ప్రకటించింది.