మన దేశంలో బ్యాంకుల పని తీరు ఎలా ఉంటుందో.. సామాన్యులు, రైతులు, పేద, మధ్య తరగతి వారి పట్ల బ్యాంకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో అందరికి తెలుసు. వేల కోట్లు దోచుకున్న వారిని.. ఏమనరు.. వారికి జోలికి వెళ్లాలన్నా.. భయపడతారు. కానీ పేదలు, రైతుల విషయంలో మాత్రం.. లోన్ డబ్బుల చెల్లింపుల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. వారికి మనశాంతి కరువయ్యేలా ప్రవర్తిస్తాయి. కాబూలీవాలాల కన్నా దారుణంగా ప్రవర్తించి.. ఆఖరికి.. వారు ప్రాణాలు తీసుకునే కాడికి తీసుకువస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఇలాంటి విమర్శలు ఎన్ని ఉన్నా.. అవి మాత్రం వాటి తీరును మార్చుకోవడం లేదు. ఆఖరికి కోర్టులు మొట్టి కాయలు వేసిన వాటి తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఎస్బీఐపై వేసిన కేసులో.. ఆమెకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద రూ. 20వేలు చెల్లించాలని తీర్పు వెల్లడించింది. ఆవివరాలు..
బెంగళూరుకు చెందిన ధరణి అనే మహిళ విషయంలో కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. ధరణి వివాహిత. గతేడాది కరోనా వల్ల భర్త రూపేష్ రెడ్డి మరణించాడు. ఆమెకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రావాల్సిన డబ్బులు కోసం బ్యాంక్ సిబ్బందిని సంప్రదించింది. అయితే బ్యాంక్ సిబ్బంది మాత్రం ఆమెను లోన్ డబ్బులు చెల్లించాలని కోరారు. పలుమార్లు బ్యాంకు సిబ్బంది నుంచి ఇదే ఇబ్బంది ఎదురవ్వడంతో.. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ బెంగళూరు అర్బన్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్సూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ను ఆశ్రయించింది ధరణి. తన భర్త మరణం తర్వాత పిల్లలు, తల్లిదండ్రుల పోషణ, ఇంటి ఖర్చులు వంటి వాటికే డబ్బులు లేవని, కేవలం ఇన్సూరెన్స్ కవర్ మీదనే ఆధారపడ్డానని, కానీ బ్యాంక్ మాత్రం లోన్ మాఫీ చేయడం లేదని ఆమె కోర్టుకు తెలిపింది.
ధరణి వాదనలపై బ్యాంక్ సిబ్బంది కౌంటర్ దాఖలు చేశారు. ధరణి, ఆమె భర్త ఇన్సూరెన్స్ పాలసీకోసం లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేయలేదని, అఫ్లికేషన్ లో ఎస్ టిక్ పెట్టడం ద్వారా అంగీకారం తెలియజేశారని పేర్కొంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇష్యూ చేయలేదని, ప్రీమియం కట్ చేసుకున్నా కూడా అది ఎస్బీఐ లైఫ్కు చేరలేదని, ఈ కారణంగా రుణ గ్రహీతకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదని బ్యాంక్ సిబ్బంది కోర్టుకు తెలిపారు. అయితే బ్యాంక్ సిబ్బంది వాదనను కోర్టు తోసిపుచ్చింది.
హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయంలో సర్వీసుల లోపం స్పష్టంగా కనిపిస్తోందని, లోన్ మంజూరు సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కోర్టు తెలిపింది. రుణ గ్రహీతలకు తెలియజేయకుండానే ఇన్సూరెన్స్ను క్యాన్సల్ చేయడం రూల్స్కు వ్యతిరేకమని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ సిబ్బంది తీరును తప్పుబడుతు తీర్పును వెలువరించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.