టాటా కంపెనీ అంటేనే ఒక చరిత్ర. చరిత్ర సృష్టించాలన్నా టాటానే, ఆ చరిత్రను తిరగరాయాలన్నా టాటానే. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 500 విమానాలను ఆర్డర్ చేసింది టాటా. విమానయాన చరిత్రలోనే ఇదొక సంచలనం. టాటా గ్రూప్ సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా భారీ డీల్ తో భారత్ లో 500 విమానాలు అడుగుపెట్టనున్నాయి. టాటా 500 విమానాలను ఎందుకు ఆర్డర్ చేసింది?
ఇటీవల కాలంలో టాటా గ్రూప్ సంస్థ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక మాంద్యం కారణంగా తమ మార్కెట్ పడిపోయిందని ఫీలవుతున్న దిగ్గజ కంపెనీలు.. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ టాటా గ్రూప్ సంస్థ భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు వెల్లడించి ప్రభంజనం సృష్టించింది. తాజాగా టాటా గ్రూప్ సంస్థకు సంబంధించి మరొక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. 500 విమానాలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ సంస్థ సిద్దమైనట్లు తెలుస్తోంది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నా మేమే అని మరోసారి టాటా గ్రూప్ నిరూపించింది.
తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర రంగాల్లోకి విస్తరించుకుంటూ పోతున్న టాటా.. గత ఏడాది దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎయిర్ ఇండియాను మరింత బలపరిచేందుకు టాటా గ్రూప్ పని చేస్తోంది. విమానయాన సర్వీసులను పెంచుకోవడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదగాలని చూస్తోంది టాటా. ఇదే సమయంలో ప్రయాణికులకు ఇతర సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం యూరోపియన్, అమెరికా విమానయాన సంస్థలైన ఎయిర్ బస్, బోయింగ్ నుంచి పెద్ద ఎత్తున విమానాలను ఎయిర్ ఇండియా సంస్థ ఆర్డర్ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
అయితే ఇది దాదాపు ఫైనల్ అయినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తం 500 విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. విమానయాన చరిత్రలోనే అతి పెద్ద డీల్ అని సమాచారం. 500 విమానాల్లో 430 నారో బాడీ, 70 వైడ్ బాడీ విమానాలను ఎయిర్ ఇండియా సొంతం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న 7, 8 సంవత్సరాల్లో ఈ 500 విమానాలను ఎయిర్ ఇండియా పూర్తిగా సొంతం చేసుకోనుందని చెబుతున్నారు. ఈ ఒప్పందంలో దిగ్గజ యూరోపియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్ బస్ కు మెజారిటీ వాటా ఉంది. ఈ సంస్థ 240 A320 Neo, 40 A350 విమానాలను డెలివరీ చేయాల్సి ఉండగా.. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ బోయింగ్.. 190 740 మ్యాక్స్, 20 787, 10 777x విమానాలను డెలివరీ చేయనుంది. బోయింగ్ తో జనవరి 29నే డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. బాంబే హౌస్ లోని టాటా సన్స్ హెడ్ క్వార్టర్స్ లో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.
అలానే ఎయిర్ బస్ తో శుక్రవారం డీల్ ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం. ఆరోజు జరిగిన మీటింగ్ లో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఎయిర్ బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ స్కెరర్ పాల్గొన్నారు. ఈ భారీ డీల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారీ డీల్ ధర 150 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో రూ. 12 లక్షల కోట్లకు పై మాటే. ఎయిర్ ఇండియాలో ఇప్పటికే ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థలు ఎయిర్ ఇండియాలో విలీనం కాగా.. సింగపూర్ ఎయిర్ లైన్స్ విస్తారాను కూడా టాటా గ్రూప్ విలీనం చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. దీంతో విమానయాన సేవలను మరింత పెంచనుంది.