బ్యాంకు అకౌంట్ అన్నాక.. మనం జరిపే ప్రతీ ట్రాన్సాక్షన్ కి ఎస్ఎంఎస్ లు వస్తుంటాయి. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ మెషిన్ లో డబ్బులు వేయడం, ఆన్ లైన్ లో ఐఎంపీఎస్ ద్వారా ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇలా చాలా సర్వీసులు ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి వరకూ బ్యాంకులు ఉచితంగానే అందించాయి. అయితే తాజా నిర్ణయంతో ఇక నుండి కొన్ని సర్వీసులకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఇప్పటివరకూ ఉచితంగా పొందిన ఏడు రకాల సర్వీసులకి సంబంధించి ఛార్జీలు వసూలు చేయనున్నాయి.
నగదు లావాదేవీల విషయంలో నిర్దిష్ట పరిమితి ఉంది. ఆ పరిమితికి లోబడి లావాదేవీలు జరిపితే వెల్ అండ్ గుడ్. ఆ పరిమితి దాటితే సర్వీస్ ఛార్జ్ కింద కొంత అమౌంట్ బ్యాంకులకు ముట్టజెప్పాల్సి వస్తుంది. ఆయా బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా కస్టమర్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐతే తమ ఖాతాదారులకు పరిమితి దాటిన లావాదేవీలకు రూ. 20 నుండి రూ. 100 వరకూ ఛార్జ్ చేయనున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు ఎంత ఛార్జ్ చేస్తాయో అనేది తెలియాల్సి ఉంది.
సేవింగ్స్ ఖాతాదారులు ఆయా బ్యాంకుల నిబంధనలకు తగ్గట్టు మినిమమ్ బ్యాలన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలన్స్ కంటే తక్కువ అమౌంట్ ఉంటే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. ఉదాహరణకు మీకు ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ ఉందనుకుంటే.. ఆ బ్యాంకులో ప్రతీ నెలా రూ. 2000 మెయింటెయిన్ చేయాలన్న నియమం ఉంటె ఖచ్చితంగా రూ. 2000 మెయింటెయిన్ చేయాలి. అలా కాకుండా రూ. 2000లలో కొంత అమౌంట్ తీసేస్తే ఛార్జీల భారం పడుతుంది.
సేవింగ్స్ ఖాతాలో డబ్బు జమ అయినప్పుడు లేదా విత్ డ్రా చేసినప్పుడు వచ్చే బ్యాంక్ అలర్ట్ మెసేజ్ లకు కూడా ఇక నుంచి ఛార్జీలు పడతాయి. అయితే మిగతా సేవలపై వసూలు చేసే ఛార్జీల కన్నా తక్కువే. నెలకొకసారి వసూలు చేసే ఎస్ఎంఎస్ ఛార్జీలు రూ. 20 లోపే ఉంటాయి.
నిర్దిష్ట సమయం వరకూ, నిర్దిష్ట విత్ డ్రాలు మాత్రమే జరిపేలా అనుమతించేవి బ్యాంకులు. బ్యాంకు ఇచ్చిన నిర్దిష్ట సంఖ్యకు మించి విత్ డ్రాలు చేస్తే ఛార్జీలు పడతాయి. అయితే ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకు ఒక్కోలా వసూలు చేస్తుంది. అత్యధిక బ్యాంకులు రూ. 20 నుండి 50 వరకూ ఈ మధ్యలో వసూలు చేస్తాయి.
ఒకవేళ మీరు ఏటీఎం/డెబిట్ కార్డు కోల్పోతే.. మరో కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త డెబిట్ కార్డు కోసం రూ. 50 నుంచి రూ. 500 మధ్య ఛార్జ్ చేస్తాయి బ్యాంకులు. ఒక్కో బ్యాంకు ఒక్కోలా ఛార్జ్ చేస్తుంది.
ఇప్పటివరకూ అన్ని బ్యాంకులు నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు ఉచితంగా అందించాయి. కానీ చాలా వరకూ బ్యాంకులు ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లపై కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆయా బ్యాంకులను బట్టి రూ. 1 నుంచి రూ. 25 వరకూ ఐఎంపీఎస్ ఛార్జ్ చేస్తున్నాయి.
లక్ష రూపాయల వరకూ చెక్ క్లియరెన్స్ కోసం బ్యాంకుకు పంపితే ఏ బ్యాంక్ కూడా ఎలాంటి ఛార్జీలు వేయదు. కానీ లక్ష కంటే ఎక్కువ మొత్తం ఉన్న చెక్ ను క్లియరెన్స్ కోసం పంపితే.. రూ. 150 వరకూ ఛార్జ్ చేయనున్నాయి. ఇక ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాదారులకు కేవలం 10 చెక్కులు మాత్రమే ఉచితంగా ఇస్తుంది. పది కంటే ఎక్కువ చెక్కులు కావాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకూ ఉచితంగా అందించిన ఈ సేవలను ఇక నుండి ఆయా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. బ్యాంకు వారు కూడా బతకాలి కాబట్టి మధ్యతరగతి వాడి మీద ఈ ఛార్జీల మోత తప్పదని అప్పుడే మధ్యతరగతి గది నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి బ్యాంకులు ఇప్పటివరకూ ఉచితంగా అందించిన సర్వీసులపై ఇలా ఛార్జీలు వసూలు చేస్తుండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.