యుద్ధం రెండు దేశాల మధ్య ప్రారంభమైతే.. దాని ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది. ప్రస్తుతం యూరప్ కేంద్రంగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇది రెండు దేశాల మధ్య యుద్ధమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ప్రపంచ దేశాలపై తీవ్రస్థాయిలో ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే.. ప్రపంచాల దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనావేస్తున్నారు.
రష్యాపై పలు దేశాల ఆంక్షల నేపథ్యంలో.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎగుమతిలో ఆటంకాలు ఏర్పడితే.. నిత్యవసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయని వార్తలొస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతుండడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. ఈ యుద్ధ ఫలితం ఎటు దారి తీస్తుందో తెలియక మదుపర్లు పెట్టుబడులు వెనక్కు తీసుకుంటుండడంతో స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో కొనసాగుతోంది. ప్రధానంగా స్మార్ట్ఫోన్లకు అవసరమైన చిప్సెట్ల కొరత తీవ్రంగా ఉండనుంది. ఎందుకంటే.. నివేదికల ప్రకారం ఉక్రెయిన్.. నియాన్ గ్యాస్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ అతిపెద్దది. చిప్ తయారీకి ఉపయోగించే లేజర్ కోసం ఈ వాయువు ఉపయోగించబడుతుంది. ఇది అమెరికాకు ఎగుమతి అయ్యే సెమీకండక్టర్-గ్రేడ్ నియాన్లో 90 శాతం పంపుతుంది.అదే సమయంలో పల్లాడియం విషయంలో ప్రపంచం మొత్తం రష్యాపైనే ఆధారపడి ఉంది. పల్లాడియం ఎగుమతిలో 35 శాతం రష్యానే సరఫరా చేస్తోంది. ఈ అరుదైన లోహాన్ని సెమీకండక్టర్ల తయారీకి కూడా ఉపయోగిస్తారు. పలు దేశాల ఆంక్షల కారణంగా.. రష్యా పల్లాడియం ధరల్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రష్యా నుంచి మైక్రోచిప్ సరఫరా కూడా నిలిచిపోనుంది. ప్రపంచ చిప్ సెట్ సరఫరాలో రష్యా వాటా 45 శాతం. ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి.. నియాన్, పల్లాడియం సరఫరాకు అంతరాయం ఏర్పడితే.. సెమీ కండక్టర్ల తయారీపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే ఈ ఉత్పత్తుల సరఫరా తక్కువగా ఉందని, పరిస్థితి మరింత దిగజారితే సంక్షోభం తలెత్తుతుందని మొబైల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.