ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కనీసం తినడానికి కూడా సమయం ఉండటం లేదు. అలాంటి వారు సమయం చిక్కినప్పుడల్లా వెరైటీ.. వెరైటీ రెస్టారెంట్లకు వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. వారానికో, నెలకో ఒకసారి ఇలా వెళ్తారు కాబట్టి.. వెళ్లే ప్లేస్ కాస్త డిఫరెంట్ గా ఉండాలని జనాలు కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు తగ్గట్లుగానే రెస్టారెంట్ యజమానులు.. రకరకాలుగా రెస్టారెంట్ లను ముస్తాబు చేస్తున్నారు. స్కై డైనింగ్, వాటర్ డైనింగ్ లాంటి ప్రత్యేకతలతో రెస్టారెంట్లను తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ముందుకు వచ్చింది ప్రముఖ సంస్థ ‘పిస్తా హౌస్’. ఏకంగా ఫ్లైట్ రెస్టారెంట్ తో భాగ్యనగర వాసులను సర్ ప్రైజ్ చేయడానికి వస్తోంది.
భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి రెస్టారెంట్లు. కస్టమర్లను సంతృప్తి పరచేందుకు వెరైటీ వెరైటీ థీమ్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రఖ్యాత రెస్టారెంట్ అయిన ‘పిస్తా హౌస్’ ఏకంగా హైదరాబాద్ లో ఫ్లైట్ రెస్టారెంట్ ను ప్రారంభించబోతుంది. రెస్టారెంట్ల రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చూట్టబోతుంది. ఎయిర్ బస్ కంపెనీకి చెందిన పాత విమానం ఏ320 ను కేరళలో నిర్వహించిన వేలంలో రూ.75 లక్షలు పెట్టి ఈ విమానాన్ని కొనుగోలు చేసింది ‘పిస్తా హౌస్’ యాజమాన్యం. త్వరలోనే హైద్రాబాద్ శివార్లలో గల శామీర్ పేటలో ఫ్లైట్ రెస్టారెంట్ గా ప్రారంభించబోతున్నారు. ఇక ఈ విమానంలో సకల సౌకర్యాలు కల్పించనున్నారు.
ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లో కూర్చుని శామీర్ పేట్ చెరువు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఘుమ ఘుమలాడే బిర్యానీ రుచులను ఆస్వాదించవచ్చు. కస్టమర్లను ఆకర్షించేందుకు పిస్తా హౌజ్ యాజమాన్యం విమానంలో ఇంటీరియల్ డిజైనింగ్ ను ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతోంది. ఇక విమానంలోకి ఎక్కేందుకు ఎస్కలేటర్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. 2023 జనవరిలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. వీకెండ్స్ లో వెరైటీ రెస్టారెంట్లకు వెళ్లాలి అనుకునే వారికి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ఓ మధురానుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల కింద బాపట్ల అండర్ పాస్ కింద ఈ విమానం చిక్కుకున్న విషయం మనందరికి తెలిసిందే.