బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో నాలుగో వారం కొత్త రచ్చ షురూ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ పోటీ కోసం కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ కొత్త టాస్కు ఇచ్చాడు. హోటల్ వర్సెస్ హోటల్ అంటూ ఇంట్లోని సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఒకే హోటల్ పెట్టి ఆడమంటే కిక్కు ఉండదు అనుకున్నారో? లేక అలా అయితే గొడవలు జరిగే ఛాన్స్ లేదని భావించారో తెలియదు. కానీ, ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా చేసి రెండు హోటళ్లను ఏర్పాటు చేశారు. కొందరిని కస్టమర్లుగా ఉంచి వారిని ఇంప్రెస్ చేయాలంటూ టాస్కు ఇచ్చారు. ఆ టాస్కులో కస్టమర్లను ఇంప్రెస్ చేసేందుకు ఇంట్లోని సభ్యులు నానా తిప్పలు పడుతున్నారు. వారి చుట్టూ తిరుగుతూ సార్ సార్ అంటూ కాళ్లు పట్టుకున్నంత పని చేస్తున్నారు.
ఈ టాస్కులో హోటల్ టీమ్ కంటే కస్టమర్లుగా అవకాశం దక్కించుకున్న వారిదే లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే కస్టమర్లను సంతృప్తి పరిస్తేనే వారికి డబ్బులు వస్తాయి. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తేనే ఆ హోటల్ టీమ్ విన్ అవుతుంది. అయితే అన్నీ సీజన్లలో ఈ తరహా బీబీ హోటల్ టాస్కు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం రెండు టీమ్లను చేసి కొత్తగా పెట్టారు. ఆదిరెడ్డి, సూర్యా, అర్జున్ కల్యాణ్, రాజ్ గెస్టులుగా వ్యవహరిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుని వారికి సేవలు చేసి మంచి మార్కులు, డబ్బులు సంపాదించేందుకు శ్రీ సత్య, వాసంతి, ఆరోహీ, కీర్తీ వంటి వారంతా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ టాస్కు అర్జున్ కల్యాణ్కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అర్జున్ కల్యాణ్ కు శ్రీ సత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అందరిలో నానుతున్న మాట. అయితే ఆమె మాత్రం అన్నా అని పిలవడం, అసలు పట్టించుకోకపోవడం చేస్తూ వస్తోంది. అయితే ఈ టాస్కు ద్వారా శ్రీ సత్య అర్జున్ కల్యాణ్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమ్లెట్ వేసేందుకు రూ.1000 అడగ్గా అందుకు అర్జున్ చాలా ఎక్కువ అని ఫీలవుతాడు. అందుకు శ్రీ సత్య ఫుడ్ కూడా తినిపిస్తాను అంటూ ఆఫర్ ఇచ్చింది. అందుకు అర్జున్ కల్యాణ్ ఓకే అని చెప్పేశాడు. ఇంకేముంది.. శ్రీ సత్య అన్నం కలిపి అర్జున్ కల్యాణ్కు గోరు ముద్దలు తినిపించడం చేసింది. అర్జున్ కల్యాణ్ మాత్రం సూపర్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీ సత్యతో గోరు ముద్దలు పెట్టించుకున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.