కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అనంతబాబుకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ నెల 19న హత్యకు గురయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో తీసుకెళ్లి డ్రైవర్ ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. దీంతో ఎమ్మల్సీ అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. అనంతబాబే హత్య చేశాడని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక విచారణలో అనంతబాబు హత్య చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ హత్య కేసులో అనంతబాబు తన తప్పిదాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ఆయనను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అటు డ్రైవర్ ను తానే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో ఒప్పుకోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అనంతబాబు పార్టీలో ఉంటే చెడ్డపేరు వస్తుందని గ్రహించిన వైసీపీ అధిష్టానం తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది.
ఇది కూడా చదవండి: Konaseema: కోనసీమ ఘటన వెనుకున్నది అతడేనా.? వైసీపీ-జనసేన ఆరోపణలు?