ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాసులు రెడ్డి సోదరుడు.. సుధాకర్రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో శుక్రవారం మధ్నాహ్నం కన్నుమూశారు. సుధాకరరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సుధాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో.. ఆయనని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు సుధాకర్ రెడ్డి మృతి చెందారు. సుధాకర్ రెడ్డికి భార్య స్నేహలత, కుమారుడు కిరణ్రెడ్డి, కుమార్తె దీప్తి ఉన్నారు. సుధాకర్రెడ్డి.. ఎంపీ శ్రీనివాసులు రెడ్డి చిన్న సోదరుడు కాగా ఆయన మరో సోదరుడు మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి కూడా కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఇన్నాళ్లు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సుధాకర్ రెడ్డి మృతి తమకు తీరని లోటని శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సుధాకర్ రెడ్డి అంత్యక్రియలను చెన్నైలోనే శనివారం నిర్వహించనున్నారు. సుధాకర్ రెడ్డి మృతిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
సుధాకర్ రెడ్డి 1949 సెప్టెంబరు 9న జన్మించారు. సినీ నిర్మాతగా, మాగుంట వ్యాపార, రాజకీయ, ప్రజా సేవా కార్యకలాపాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. సుధాకర్రెడ్డి.. కుటుంబ వ్యవహారాల్లో, వ్యాపార, రాజకీయ, ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ ఎంతో కీలకంగా వ్యవహరించేవారు. పెద్ద సోదరుడు సుబ్బరామిరెడ్డి మృతి తర్వాత సుధాకర్ రెడ్డి వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఇక సుధాకర్ రెడ్డి ప్రోత్సాహంతోనే 1991లో సుబ్బరామిరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. సోదరుడి మరణం తర్వాత సుధాకర్రెడ్డి వివిధ సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. ఇక సుధాకర్ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో పలు సినిమాహాళ్లు నిర్వహిస్తున్నారు.