సినిమాల్లో జనాలకు కష్టం వస్తే హీరోలు కొన్ని సార్లు మారువేశాలు వేసుకొచ్చి కాపడుతుంటారు. అచ్చం అలాంటి సీన్లను గుర్తుకు తెచ్చారు యంగ్ డీఎస్పీ దిలీప్ కిరణ్. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఇటీవల దొంగతనాలు, అర్ధరాత్రిళ్లు తాగి గొడవలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. దీంతో డీఎస్పీ దిలీప్ కిరణ్ నగరంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బైక్ పై నగరం మొత్తం తిరుగుతూ నైట్ షిఫ్ట్ పోలీసులకు సడన్ ట్విస్ట్ ఇచ్చారు.
అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వివరాలు కనుక్కొని ఈ టైంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎలా పనిచేయాలో సూచనలు ఇచ్చారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఇక రెగ్యులర్గా ఉంటాయని డీఎస్పీ కిరణ్ చెబుతున్నారు.